తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను ఆదివారం ఉదయం ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు టికెట్ ఖరారు చేశారు. మొదటి జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి దంపతులు, జానారెడ్డి కుమారుడు తదితరులున్నారు.
అయితే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. కేసీఆర్ను ఓడించడమే తన ఏకైక లక్ష్యంగా పొంగులేని అనేక మార్లు చెప్పారు.
పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం సీటును పొంగులేటి ఆశిస్తున్నారు. అయితే ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి పోటీ చేస్తారని, ఈ మేరకు అంగీకారం కుదరిందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. మొదటి జాబితాలో వీళ్లిద్దరి పేర్లు తప్పక వుంటాయని అంతా అనుకున్నారు.
కానీ పొంగులేటి, తుమ్మల అనుచరులకు కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలిక షాక్ ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్లో తమ నాయకుల పేర్లు లేకపోవడంతో తుమ్మల, పొంగులేటి అనుచరులు అసలేం జరుగుతోందని ఆరా తీస్తున్నారు. పాలేరు, ఖమ్మం సీట్లపై ఇద్దరు నాయకులు పట్టుపడుతున్నారా? లేక మరేవైనా కారణాలతో ప్రకటించలేదా? అనే చర్చకు తెరలేచింది.