‘భవిష్యత్కు గ్యారెంటీ’ పేరుతో చంద్రబాబు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంక అయ్యిందని, బాబు పథకాలతో అమెరికా, సింగపూర్, జపాన్ దేశాల మాదిరిగా తయారవుతుందని నెటిజన్లు వెటకరిస్తున్నారు.
సంక్షేమానికి పెద్దపీట వేస్తానంటున్న చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఏపీకి మహా ప్రయోజనం అవుతుందని రేపటి నుండి రాజగురువు పత్రికలో ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు డాక్టర్ జీవీరావు లాంటి వాళ్ల ఇంటర్వ్యూలు వస్తాయని దెప్పి పొడుస్తున్నారు.
బాబు మేనిఫెస్టో ప్రకటనతో టీడీపీ అధికారంలోకి రాకమునుపే అమెరికాని ఆంధ్రప్రదేశ్ దాటేసిందని, ఇక అధికారంలోకి వస్తే చంద్ర మండలంపై ఆంధ్రప్రదేశ్ కి సరికొత్త రాజధాని సృష్టిస్తారని ఎల్లో మీడియా ప్రతినిధుల విశ్లేషిస్తున్నారని వ్యంగ్య పోస్టులు పెట్టడం గమనార్హం.
అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా చంద్రబాబు మేనిఫెస్టో వుందని చీవాట్లు పెడుతున్నారు. మహిళలకు పెద్దపీట అంటూ చెబుతున్న చంద్రబాబుపై ఓ రేంజ్లో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
పురుషులకు రోజూ సాయంత్రం క్వార్టర్ మందు, మంచింగ్ కోసం 100గ్రాముల చికెన్, మత్తు ఎక్కువైతే ఇంటి దగ్గర దింపడానికి ప్రత్యేక వాహన సౌకర్యాలు కల్పిస్తామని భవిష్యత్లో తీసుకొచ్చే మేనిఫెస్టోలో చేర్చాలని నెటిజన్లు తమ సృజనకు పదును పెట్టారు. ఇలాంటి గొప్ప గొప్ప పథకాల గురించి కూడా ఆలోచించి పుణ్యం కట్టుకో బాబయ్యా అంటూ వెటకారపు వినతులు కూడా ప్రత్యక్షమయ్యాయి.
టీడీపీ మేనిఫెస్టో అమలుకు దొంగ నోట్ల ముద్రణకు ప్రత్యేక యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు నిధి ఏర్పాటుకు ఆలోచిస్తే మంచిదనే హితవచనాలు లేకపోలేదు. ఇన్నాళ్లు జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, ఇప్పుడు ఆయన మార్గంలో నడిచేందుకు సిగ్గనిపించలేదా చంద్రబాబూ అనే నిలదీతలను చూడొచ్చు.