ఒకవైపు కరోనా స్ట్రెయిన్ భయాలు నెలకొన్న నేపథ్యంలో కూడా దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖమే పడుతూ ఉండటం ఊరటను ఇచ్చే అంశం.
దేశంలో కరోనా ఆరు నెలల కనిష్టానికి చేరినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 18,732 కొత్త కేసులు నమోదు అయిన నేపథ్యంలో.. ఈ నంబర్ ఆరు నెలల కనిష్టంగా నమోదైంది.
ఈ ఏడాది జూన్ ఆరు న 18,653 కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఆ మేరకు కేసుల పెరుగుదల హడలుగొట్టింది. ఆరోహణ క్రమంలో అప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ ఆరు నెలల కిందట ఒకే రోజున 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అవరోహణ క్రమంలో కేసుల సంఖ్య తగ్గుతూ రోజువారీ కేసుల సంఖ్య 18 వేల స్థాయికి తగ్గింది.
ఇలా ఇండియాలో కరోనా కేసుల సంఖ్య ఆరు నెలల కనిష్ట స్థాయిలో నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో న్యూ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది అనే భయాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటి నుంచి ఇంకా పూర్తి రిలీఫ్ లభించడం లేదు.
బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారిని ట్రాక్ చేసి పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. న్యూ స్ట్రెయిన్ వ్యాప్తి విషయంలో పూర్తి క్లారిటీ రావడానికి మరి కాస్త సమయం పట్టొచ్చు.
ఇంకోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. యూరోపియన్ దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతూ ఉంది. దేశాధ్యక్ష స్థానాల్లో ఉన్న వ్యక్తులే వ్యాక్సిన్ వేయించుకుని వ్యాక్సిన్ పై ప్రజలకు భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారంలోనే యూకే పరిధిలో కూడా వ్యాక్సినేషన్ మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి.