రాజకీయ పార్టీలకు ఆవిర్భావ దినోత్సవాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ తన బర్త్ డే ను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. రాజకీయ పార్టీ ఆవిర్భావం వెనుక ఎంతో బలమైన ఉద్దేశాలు, కొన్ని రాజకీయ పోరాటాలూ.. ఉండనే ఉంటాయి.
ప్రత్యేకించి సదరు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఆవిర్భావ దినోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించుకుంటూ ఉంటారు సదరు పార్టీల నేతలు. అధికారం సంపాదించుకోవడానికి పోరాడే స్ఫూర్తిని అందుకోవడానికి ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకుంటూ ఉంటారు నేతలు.
మరి అలాంటి స్ఫూర్తి చాలా అవసరం ఉన్న పార్టీ కాంగ్రెస్. నేడు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సోనియా, రాహుల్ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్ల హీన దశలో ఉంది. బీజేపీ వాళ్లేమో కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నారు. అయితే ప్రజలు అక్కడక్కడ, అప్పుడప్పుడు కాంగ్రెస్ ను ఆదరిస్తూనే ఉన్నారు. దేశానికి ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం ప్రజాస్వామ్యంలో.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ స్థాయి బలం పుంజుకోవడం లేదు. అలాంటి ఉద్దేశమే ఆ పార్టీకి కనపడదు. ఈ క్రమంలో దాని ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆ పార్టీ ఆశాకిరణం రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? అంటే.. ఆయన యూరప్ వెళ్లారు! ఇటలీ వెళ్లారట, అందులోనూ మిలన్ వెళ్లారట.
ఇది రాహుల్ వ్యక్తిగత పర్యటన అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని దేశ వ్యాప్తంగా తమ శ్రేణుల్లో స్ఫూర్తి నింపాల్సిన ఈ నేత ఇటలీలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాడట. ఒకవైపు సోనియాగాంధీ అనారోగ్యంతో ఇంటికి పరిమితం అయ్యారు.
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆమె జనం మధ్యకు వచ్చే పరిస్థితి లేదు. ఆమె ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కావడం లేదని స్పష్టం అవుతూ ఉంది. ఇలాంటి సమయంలో తన బాధ్యతను వదిలి రాహుల్ మరోసారి పర్సనల్ టూర్ కు చెక్కేశారు.
కాంగ్రెస్ మీద అధికా కక్ష కేవలం సోనియా, రాహుల్ లకే ఉన్నట్టుంది. రాహుల్ నే మరోసారి జాతీయాధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సరిగ్గా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫారెన్ టూర్ కు చెక్కేసి రాహుల్ తన తీరును మరోసారి చాటుకున్నాడు. ఈయనను నమ్ముకుని ఇంకా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ ఉండటం.. కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదడం అనే సామెత కన్నా కామెడీగా ఉంది!