తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి అధికార వైసీపీ ముహూర్తం ఖరారు చేసింది. కొత్త ఏడాది జనవరి 6నుంచి ఉప ఎన్నిక ప్రచారాన్ని మొదలు పెట్టాలని పార్టీ అధికారికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నిక, అనుసరించాల్సిన వైఖరిపై మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి , ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటేశ్గౌడ్, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తదితరులు ఆదివారం తిరుపతిలో సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు.
సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికపై సమాలోచనలు చేశామన్నారు. సెంట్మెంట్గా కరకంబాడీ రోడ్డులోని 50వ డివిజన్ నుంచి వచ్చే నెల 6న మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో ప్రచారాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించామన్నారు.
తమ అభ్యర్థి ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అప్పగించామని, త్వరలో ఆయన ప్రకటిస్తారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాత్రమే తాము ప్రచారం చేస్తామన్నారు.
గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించటమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన మండిపడ్డారు.