తాడిపత్రిలో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనపై సీరియస్గా చర్చ నడుస్తోంది. పోలీసులు ఇటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలతో పాటు వారి తనయుడు, అనుచరులపై వివిధ కేసులు పెట్టారు.
ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన కామెంట్స్ సీరియస్సా లేక కామెడీనా అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసీ బ్రదర్స్ వ్యవహార శైలి తెలిసిన వాళ్లు ఈ రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తనను చంపాలని చూస్తున్నారనేది ఆయన తాజా సంచలన ఆరోపణ. దీనికి పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరును ఆయన తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రో , పెద్దారెడ్డో తనను తొలగించే పనికి కుట్రపన్నారని ఆరోపించి ఉంటే అదో లెక్క. ఆ ఆరోపణలు రక్తి కట్టించి ఉండేవి.
కానీ ఈ వివాదంలోకి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు లాగారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇంటి పేరుకు తగ్గట్టే స్వభావం కలిగిన సజ్జలపై జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపణలు రాజకీయంగా పేలలేదు.
జేసీ ప్రభాకర్రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను ప్రజల మనిషినని, ప్రజల్లోనే ఉంటానన్నారు. చంపుతావా? సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని ఆరోపించారు. చంబల్ లోయల్లో ఉండాల్సిన వాళ్లు తాడిపత్రిలో ఉన్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. పుటేజీ తీసుకుని కేసు పెట్టమంటే, ఒత్తిళ్లు ఉన్నాయని పోలీసులు అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.