ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై అనే తేల్చి చెప్పారు. భవిష్యత్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పొత్తులు కుదుర్చుకుంటాయని నారాయణ జోస్యం చెప్పారు. ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే…. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారని ఆయన సంచలన ప్రకటన చేశారు. వైసీపీని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేనతో కలిసి తాము పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ఇంకా సజీవంగా ఉండగానే, అందుకు పూర్తి విరుద్ధంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నారాయణ మనసులో ఏదో దాచుకోరు. మనసులో ఏది ఉన్నా వెంటనే కక్కేస్తుంటారు. ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆ మూడు పార్టీలకు షాక్ ఇచ్చేలా ఉంది.
బీజేపీపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వుందని ఆయన అన్నారు. ఈ వ్యతిరేకత మూడు పార్టీల కూటమిపై తప్పక పడుతుందని హెచ్చరించారు. దీంతో బీజేపీ వ్యతిరేకులంతా వైసీపీకి ఓట్లు వేస్తారన్నారు. ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్గా నిలుస్తారన్నారు. దీంతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నారాయణ స్పష్టం చేయడం విశేషం. బీజేపీతో జత కట్టొద్దని జనసేనాని పవన్కల్యాణ్కు సూచిస్తున్నట్టు ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో, దాన్ని అడ్డు పెట్టుకుని జగన్ను కట్టడి చేయొచ్చనే వ్యూహంతో ఏపీలో ఆ పార్టీకి బలం లేకున్నా పొత్తు కోసం వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ జగనే సీఎం అవుతారనే నారాయణ కామెంట్స్ ఆ మూడు పార్టీల అభిమానులకు తప్పక కోపం తెప్పిస్తాయి. తమను టీడీపీ, జనసేన కలుపుకుని వెళ్లకపోవడం వల్లే నారాయణ అక్కసు వెళ్లగక్కుతున్నారనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.