వైసీపీ ప్రభుత్వంపై రెండు రోజులుగా ట్విటర్ వేదికగా జనసేనాని పవన్కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆ మాత్రం దూకుడిని అభినందించాల్సిందే. అయితే ఇది అప్పుడప్పుడు మాత్రమే కాకుండా, నిత్యం ఉండాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
తాజాగా అన్నమయ్య జిల్లాలో డ్యామ్ తెగి 18 నెలలైందని, ఇంత వరకూ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టలేదంటూ పవన్కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ ఆగ్రహానికి భయపడో, మరే కారణమో తెలియదు కానీ, అన్నమయ్య కలెక్టర్ గిరీష్ షా స్పందించారు. నెలలోపు బాధితులందరి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి పవన్కల్యాణ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎంత మేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే అని, అప్పటి వరకూ జనసేన నిరీక్షిస్తుందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు మోకాలడ్డేలా, కంటి తుడుపు చర్యలా ఉండబోవని తాను భావిస్తున్నట్టు పవన్కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ విమర్శలతోనైనా అన్నమయ్య డ్యామ్ బాధితులకు న్యాయం జరిగితే చాలు. అయితే పవన్కల్యాణ్ అప్పుడప్పుడు కనబరిచే శ్రద్ధ, జనసేన పార్టీ నిర్మాణంపై కూడా పెడితే బాగుంటుందనే హితవు చెప్పేవాళ్లు ఎక్కువగా ఉన్నారు.
18 నెలలుగా అన్నమయ్య బాధితులకు న్యాయం జరగలేదనే పవన్ విమర్శను మెచ్చుకుంటూనే, పదేళ్లుగా తమరి పార్టీకి ఒక నిర్మాణాత్మక ఇల్లు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నారు. కావున ఇప్పటికైనా జనసేనాని అన్నమయ్య డ్యామ్ బాధితుల ఇళ్లతో పాటు తన పార్టీ ఇంటి గురించి కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని అభిమానులు చెబుతున్నారు. పవన్కల్యాణ్ వినిపిస్తున్నాయా… అభిమానుల మాటలు. చెవికెక్కించుకోండి సార్!