జనసేనాని పవన్కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య రాజకీయ పరిణతిలో ఎంత తేడా? తనది సుదీర్ఘ రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, ఆయన అనుభవమంత వయస్సున్న పవన్కల్యాణ్ అనంతపురం దళిత యువతి హత్యపై స్పందించిన తీరు చూస్తే …జనసేనానిపై గౌరవం పెంచేలా ఉంది.
ఇదే సందర్భంలో పవన్ స్పందించిన తీరు చంద్రబాబు సిగ్గుపడేలా చేస్తోంది. చాలా తక్కువ రాజకీయ అనుభవం ఉన్న పవన్కల్యాణ్ …దళిత యువతి హత్యను సామాజిక కోణంలో చూస్తే, చంద్రబాబు మాత్రం కేవలం జగన్పై విమర్శలు చేయడానికి రాజకీయ కోణంలో చూడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వైఖరే చంద్రబాబును ప్రజల్లో చులకన చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దళిత యువతి స్నేహలతను ఆమె ప్రేమికుడే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్గా స్పందించారు. తక్షణం విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్ష విధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఇతర లబ్ధి చేకూరుస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆన్లైన్లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి ప్రయత్నించారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
‘రాష్ట్రంలో మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు, హత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదు? తాడేపల్లిలో ఏం ఉద్ధరిస్తున్నారు? అనంతపురం జిల్లాలో ఎస్సీ యువతి స్నేహలత సజీవ దహనం నిర్భయ, దిశ ఘటనలకంటే దారుణమైంది. అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా గన్ వచ్చేలోపు జగన్ వస్తాడన్న ముఖ్యమంత్రి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే గన్ ఎక్కడ? జగన్ ఎక్కడ? ఆడపిల్లలందరికీ మేనమామలా ఉంటానని చెప్పిన వ్యక్తి వారి రక్షణకు ఏంచేస్తున్నారు? విజయవాడలో ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేస్తే ఆ యువతి తల్లిదండ్రుల్ని సీఎం ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబసభ్యుల్ని కూడా సీఎం గెస్ట్హౌస్కి పిలిపించుకొని మాట్లాడారు. ఆయనకు ఎంత గర్వం. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి సీఎం ఎందుకు ఓదార్చడం లేదు ’ అని బాబు మండిపడ్డారు.
అనంతపురం ఘటనపై జనసేనాని పవన్కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ స్పందన ఏంటో తెలుసుకుందాం.
‘రాష్ట్రంలో వ్యవస్థల వైఫల్యమే అనంతపురం జిల్లా ధర్మవరంలో యువతి స్నేహలత ప్రాణాలు తీసింది. రాష్ట్రంలోని మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదు. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ధర్మవరంలో దళిత యువతి హత్యకు గురికావడం అత్యంత బాధాకరం.
తమ బిడ్డను వేధిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీస్స్టేషన్కు వెళ్తే అక్కడి అధికారుల ప్రవర్తన వారిని మరింత కుంగదీసింది. ‘అక్కడి నుంచి ఇల్లు మారిపోండి’ అంటూ పోలీసులు సలహా ఇవ్వడం చూస్తే ఆ వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంతో ఉందో అర్థమవుతోంది. వ్యవస్థల వైఫల్యంతోనే ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో స్నేహలత ప్రాణాలు కోల్పోయింది’ అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్నేహలత హత్యపై బాబు స్పందనలో ఆవేదన కంటే జగన్పై అక్కసు కనిపిస్తోంది. అలాగే రాజకీయంగా జగన్ సర్కార్ను బద్నాం చేసేందుకు ఓ ఘటన చిక్కిందనే రాజకీయ అవకాశవాదం, పైశాచికత్వం కనిపిస్తోంది.
బాధితులను నేరుగా పరామర్శించని జగన్కు ఎంత గర్వమని ప్రశ్నిస్తున్న చంద్రబాబు చేస్తున్నదేంటి? తాను మాత్రం ఫోన్లో మాట్లాడితే సరిపోతుందా? తనను ఘోరంగా ఓడించిన జగన్పై ఏ విధంగా కక్ష తీర్చుకోవాలా? అనే ద్వేషం తప్ప, బాబు స్పందనలో నిజాయితీ, చిత్తశుద్ధి ఏ మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే పవన్కల్యాణ్ విషయానికి వస్తే … రాజకీయంగా జగన్ అంటే అసలు గిట్టదనే విషయం బహిరంగ రహస్యమే. కానీ స్నేహతల హత్యపై ఆయన స్పందించిన తీరు హూందాగా ఉంది. అలాగే ఆయన లేవనెత్తిన ప్రశ్నల్లో చిత్తశుద్ధి ఉంది. స్నేహలత హత్యకు పోలీసుల బాధ్యతా రాహిత్యమని పవన్ ఆరోపించడంలో ఔచిత్యం ఉంది. అన్ని ఫిర్యాదులను ఒకేలా భావించడం పోలీసులకు సర్వసాధారణమైందనే ఆరోపణలు లేకపోలేదు.
ఒక ఘటనపై నాయకులు స్పందించే తీరు వారి క్యారెక్టర్ను ప్రతిబింబిస్తుంది. అలాగే హూందాగా స్పందిస్తే గౌరవం పెరుగు తుంది. లేదంటే అభాసుపాలు చేస్తుంది. రాజకీయ అనుభవాన్ని బట్టి నాయకులకు ప్రజల్లో పరపతి పెరగదు. ప్రవర్తనే అంతి మంగా ప్రజాభిమానాన్ని చూరగొనేలా చేస్తుంది. ఏపీలో చంద్రబాబుతో పోల్చుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా హూందాగా, బాధ్యతగా ప్రవర్తిస్తారనే అభిప్రాయం ఏర్పడేందుకు అనంతపురం ఘటనే నిదర్శనం.