విలక్షణ నటుడు కమల్హాసన్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా తన ప్రత్యేకత చాటుకోవాలని కోరుకుంటున్నారు. మక్కల్ నీది మయం అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళుతున్నారు.
వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్ని కల్లో తలపడేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. తమిళ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను రాజకీయాల్లో వచ్చానని ఆయన ప్రకటించారు.
తాను అధికారంలోకి వస్తే ఏఏ వర్గాలకు ఏమేమి చేయనున్నారో ఆయన ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఏ రాజ కీయ పార్టీ , నాయకుడు చేయని ఆలోచనను కమల్హాసన్ చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ….కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించి ఆశ్చర్య పరిచారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ, మహిళలను మాత్రం తప్పక ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా తిరువణ్ణామలై జిల్లాలో మంగళవారం కమల్హాసన్ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఆయన వెనక్కి ఊరికే వెళ్లకుండా, నాలుగు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అదే ఊర్లో ఒక కల్యాణ మండపంలో అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ ప్రణాళికలపై తన మనసులో దాగిన వినూత్న ఆలోచనలను పంచుకున్నారు.