వైసీపీలో మళ్లీ టెన్షన్. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. విచారించిన ప్రతిసారి అవినాష్రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి ప్రచారానికి సీబీఐ అవకాశం కల్పించడం గమనార్హం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ అవినాష్కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్రెడ్డి సుప్రీంకోర్టు వరకూ న్యాయపోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఊరట లభించలేదు. అవినాష్ విషయంలో సీబీఐ చాలా సంయమనంతో వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటికే అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని సీబీఐ విచారించింది.
సీబీఐ పదేపదే అవినాష్రెడ్డిని విచారణ నిమిత్తం పిలవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఇంకా ఏ వివరాలు రాబట్టేందుకు అవినాష్ను విచారిస్తోందనే చర్చకు తెరలేచింది.
ఇదిలా వుండగా సీబీఐ నోటీసులు ఇచ్చే సమయానికి అవినాష్రెడ్డి కడపలో ఉన్నారు. దీంతో వెంటనే హైదరాబాద్కు అవినాష్రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యినట్టు సమాచారం. అవినాష్రెడ్డిని సీబీఐ విచారిస్తున్న ప్రతి సందర్భంలోనూ వైసీపీలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. అవినాష్రెడ్డిపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంటే పరిణామాలు ఎలా వుంటాయ్? ఈ ఎఫెక్ట్పై రాజకీయంగా అధికార పార్టీపై ఎంత వరకు పడుతుందనే చర్చ నడుస్తోంది.