విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్కల్యాణ్లపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా ఏమీ లేదన్నారు. ఎందుకంటే చంద్రబాబుకు విశ్వసనీయత లేదని విమర్శించారు. టీడీపీ, చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది మోసం, వెన్నుపోటు, దగా అని సీఎం జగన్ విరుచుకుపడ్డారు.
చంద్రబాబు అంటే తనకు కక్ష లేదన్నారు. తాను లండన్ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు. నిజంగా కక్షే వుంటే, కేంద్రంలో బీజేపీ సర్కార్ వుందని, ఏపీకి వెళితే ఆ పార్టీలో సగం మంది టీడీపీ నేతలే ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ తాను ఎన్డీఏలో ఉన్నానని పవన్కల్యాణ్ చెబుతున్నాడని సీఎం దెప్పి పొడిచారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలున్నా ఆయన్ను అరెస్ట్ చేయవద్దని ఎల్లో దొంగలు వాదిస్తున్నారని చురకలు అంటించారు.
చంద్రబాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్టే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని వైసీపీ సైనికులు ఊరూరా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు ప్రజలతో తప్ప మరెవరితోనూ పొత్తు వుండదన్నారు. తాను నమ్ముకున్నది దేవుడు, ప్రజలను మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు, దత్త పుత్రుడు, ఇంకా నలుగురు కలిసి ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఆలోచన చేయాలన్న ఆలోచన పచ్చ బ్యాచ్కు లేదన్నారు. ఎంత సేపూ దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడంపైనే వాళ్ల దృష్టి వుందని విమర్శించారు. చంద్రబాబునాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్మును ఎల్లో మీడియాధిపతులు, దత్త పుత్రుడికి పంచి పెడతారని ఆరోపించారు.