మహదేవ్ బెట్టింగ్.. కంగనా కామెంట్స్ వైరల్

ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న స్కామ్ మహదేవ్ బెట్టింగ్ స్కామ్. బాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఇందులో చిక్కుకున్నారు. రణబీర్ కపూర్, సోనూసూద్, సోనాక్షి సిన్హా, శ్రద్ధాకపూర్.. ఇలా చాలామందికి ఈ…

ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న స్కామ్ మహదేవ్ బెట్టింగ్ స్కామ్. బాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఇందులో చిక్కుకున్నారు. రణబీర్ కపూర్, సోనూసూద్, సోనాక్షి సిన్హా, శ్రద్ధాకపూర్.. ఇలా చాలామందికి ఈ కేసులో ప్రమేయం ఉంది. 34 మంది బాలీవుడ్ ప్రముఖుల్లో చాలామందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణం ఓ రేంజ్ లో సాగుతోంది.

ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై కంగనా రనౌత్ స్పందించింది. సెన్సేషన్ ఎక్కడుంటే, అక్కడ తన మార్క్ వేయడానికి ప్రయత్నించే ఈ ముద్దుగుమ్మ.. మహదేవ్ బెట్టింగ్ యాప్ పై సంచలన ప్రకటన చేసింది.

ఈ బెట్టింగ్ యాప్ యజమాన్యం, ఏడాదిలో 6సార్లు కంగనా రనౌత్ ను సంప్రదించిందింట. కలిసిన ప్రతిసారి ఆఫర్ చేసిన మొత్తానికి కోట్ల రూపాయల్ని జత చేస్తూ వచ్చారట. ఇలా ఎప్పటికప్పుడు కోట్ల డబ్బు ఆఫర్ చేసినప్పటికీ, తను బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చింది కంగనా.

ఎండోర్స్ మెంట్ కు ఒప్పుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పరోక్షంగా సెలబ్రిటీలకు సూచించింది కంగన. ఇది నయా భారతదేశమని, చాలామంది ఇంకా మెరుగుపడలేదని, అలాంటి వాళ్లను బలవంతంగా మెరుగుపరుస్తారని పరోక్షంగా చురకలంటించింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఈడీ ముందు హాజరుకావడానికి రణబీర్ కపూర్ కొంత సమయం కోరిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం, ఆయన నిన్న ఈడీ ఎదుట హాజరవ్వాలి. కానీ ఆయన వారం రోజుల సమయం కోరాడు.

ఇప్పటికే ఈడీ పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ప్రశ్నించింది. త్వరలోనే మరింతమంది ప్రముఖులకు నోటీసులు వెళ్లబోతున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసినందుకు ఎంత తీసుకున్నారు, ఆ మొత్తం ఏ రూపంలో అందిందనే కోణంలో ఎంక్వయిరీ నడుస్తోంది. ఇప్పటికే సదరు బెట్టింగ్ యాప్ కంపెనీకి చెందిన వందల కోట్ల రూపాయల్ని ఈడీ ఫ్రీజ్ చేసింది.