అమ‌రావ‌తిపై…ఉద్య‌మ నాయ‌కుడి సంచ‌ల‌న పోస్ట్‌!

అమ‌రావతిపై రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మ నాయ‌కుడు కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్ట్ పెట్టారు. ఎల్లో చాన‌ల్స్ డిబేట్ల‌లో నిత్యం పాల్గొంటూ వైసీపీ ప్ర‌భుత్వంపై కొలిక‌పూడి తీవ్ర వ్యాఖ్య‌లు చేసే సంగ‌తి తెలిసిందే.…

అమ‌రావతిపై రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మ నాయ‌కుడు కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్ట్ పెట్టారు. ఎల్లో చాన‌ల్స్ డిబేట్ల‌లో నిత్యం పాల్గొంటూ వైసీపీ ప్ర‌భుత్వంపై కొలిక‌పూడి తీవ్ర వ్యాఖ్య‌లు చేసే సంగ‌తి తెలిసిందే. అంతెందుకు, అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడాడ‌నే ఆవేద‌న‌, ఆవేశంతో ఏపీ బీజేపీ నేత‌పై లైవ్ డిబేట్‌లో ఏకంగా చెప్పుతో దాడి చేసిన ఉద్య‌మ‌నాయ‌కుడిగా కొలికిపూడిని కొన్ని వ‌ర్గాలు ఆద‌రించాయి.

అలాంటి కొలికిపూడి శ్రీ‌నివాస‌రావు అమ‌రావ‌తి ఉద్య‌మ ప‌త‌నంపై తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొలికిపూడి త‌న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎందుకంటే, ఆయ‌న పోస్టు ఇంత కాలం అమ‌రావ‌తి వ్య‌తిరేకులు చేస్తున్న వాద‌న‌ను ప్ర‌తిబింబించేలా వుంది. కొలికిపూడి త‌న పేరుతో బోల్డ్ లెట‌ర్స్‌తో పెట్టిన పోస్ట్‌లో ఏముందో చూద్దాం.

“అమ‌రావ‌తి ఉద్య‌మం రైతుల నాయ‌క‌త్వంలో న‌డిచిన‌న్ని రోజులు ప్ర‌భుత్వాన్ని భ‌య‌పెట్టింది. రియ‌ల్ ఎస్టేట్ ద‌ళారులు ఉద్య‌మ నాయ‌కులైన త‌ర్వాత …ఉద్య‌మం చ‌చ్చిపోయి ప్ర‌భుత్వ‌మే రైతుల్ని భ‌య‌పెట్టింది. ప్ర‌స్తుతం ప్ర‌తి పార్టీ ఓట్ల‌ను లెక్కేసుకుంటోంది. రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌ను బ‌లి ఇస్తోంది”

రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకునేది లేద‌ని తెగేసి చెబుతున్న వైసీపీ గురించి ఆ ప్రాంత రైతులు పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే రాజ‌ధానికి తాను శ‌త్రువ‌ని వైసీపీ బ‌హిరంగంగా ప్ర‌క‌టించుకుంది. కానీ రాజ‌ధానికి క‌నిపించ‌ని శ‌త్రువుల‌తోనే ఎక్కువ ప్ర‌మాదం అని కొలిక‌పూడి పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. కొలిక‌పూడి పోస్ట్‌ను గ‌మ‌నిస్తే, ఆయ‌న ఆందోళ‌న కూడా అదే అన్న‌ట్టుగా వుంది.

అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌ను బలి ఇస్తున్నాయ‌ని …ఇంత‌కాలం ఆ ఉద్య‌మాన్ని మోస్తున్న కొలికిపూడి చేసిన కామెంట్స్‌కు ఎంతో విలువ వుంది. గ‌త మూడేళ్లుగా అమ‌రావ‌తి ఉద్య‌మ వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తున్న కొలిక‌పూడి… ఆ స‌మ‌రంలో అంత‌ర్గ‌తంగా సాగుతున్న కుట్ర‌ల్ని చూసి, విసిగి వేసారి ఈ పోస్ట్ పెట్టార‌నే అభిప్రాయం క‌లిగిస్తోంది. 

అమ‌రావ‌తిని బ‌లిపెట్ట‌డంలో  టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ , కాంగ్రెస్‌…ఇలా అన్ని పార్టీలు తిలా పాపం త‌లా పిడికెడు అనే సామెత చందాన భాగం పంచుకున్నాయ‌ని కొలిక‌పూడి పోస్ట్ సారాంశంగా చెప్పుకోవ‌చ్చు.