రాయలసీమ అంటే చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్కు మొదటి నుంచి చులకనే. రాయలసీమ తమకు ఓటు బ్యాంక్ కాదని తండ్రీతనయులు భావన. అందుకే సీమను నిర్లక్ష్యం చేయడానికి కారణమైంది.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమకు రాజధాని లేదా హైకోర్టు ఇవ్వాల్సి వుంది. అయితే దాన్ని చంద్రబాబునాయుడు పెడచెవిన పెట్టారు. బాబు హయాంలో రాజధాని ప్రకటన సందర్భంలో సీమ వాసులు తమకు ఏదో ఒకటి ఇవ్వాలని ఆందోళనలు నిర్వహించారు. సీమవాసుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోకుండా అన్నీ అమరావతిలోనే పెట్టారు.
టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత పరిణామాలేంటో అందరికీ తెలిసినవే. ప్రస్తుతం మూడు రాజధానులంటూ వైసీపీ ప్రభుత్వం పోరాడుతోంది. రాయలసీమకు హైకోర్టు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే సీమకు హైకోర్టు బెంచ్ ఇస్తామని తాజాగా లోకేశ్ ప్రకటించడం గమనార్హం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన వెలగబెట్టినప్పుడు ఏం చేసిందో అందరికీ తెలుసు.
ఇప్పుడు మరోసారి అధికారం ఇస్తే సీమను ఉద్దరిస్తామని లోకేశ్ నమ్మబలుకుతున్నారు. తండ్రీతనయుల హామీలను జనం నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు అధికారంలో వుంటే రాయలసీమ నిర్లక్ష్యానికి గురికావడం పరిపాటైంది. కేవలం ఓట్ల దృష్టితో పాలన సాగిస్తుండడం వల్లే సీమ ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోతోంది. చంద్రబాబు పాలనా విధానాలు వేర్పాటువాదానికి దారి తీస్తోంది.
తమ పాలనా రీతుల వల్లే నేడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్న స్పృహ టీడీపీకి లేకపోయింది. మళ్లీ తాము అధికారంలోకి వస్తే సీమకు బెంచ్ మాత్రమే ఇస్తామన్న లోకేశ్ను ఆదరిస్తారా? లేక హైకోర్టు ఇస్తామన్న వైసీపీ సర్కార్నా అనేది తేలాల్సి వుంది.