జాతీయ నాయకుడైపోయిన కేసీఆర్… ఇక ప్రధాని అవుతారా?

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇందుకు కారణం ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు కాబట్టి. కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా జరుపుకోవాలని కుమారుడు…

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇందుకు కారణం ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు కాబట్టి. కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా జరుపుకోవాలని కుమారుడు కమ్ మంత్రి కమ్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అయినా కేటీఆర్ పిలునివ్వడంతో మొదటి రెండు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

మూడో రోజైన ఈరోజు జన్మదిన వేడుకలు ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. ఈ పుట్టిన రోజుకు ప్రత్యేకత కూడా ఉంది. సారు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. కేంద్రంలో బీజేపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదని కంకణం కట్టుకున్నారు. మోడీని దేశం నుంచి తరిమేస్తామని, ఢిల్లీ కోట బద్దలు కొడతామని కేసీఆర్ ఈ మధ్య సింహ గర్జన చేశారు.

మాజీ ప్రధాని దేవీ గౌడ కేసీఆర్ పోరాటానికి మద్దతు ఇస్తానన్నారు. మహారాష్ట్ర శివసేన పులి మీరు పోరాడండి మీ వెంట మేముంటాం అన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శభాష్ అని భుజం తట్టారు. కేసీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బెంగళూరుకు వస్తానని దేవెగౌడకు చెప్పారు. ముంబాయికి వచ్చి మాట్లాడతానని ఉద్దవ్ ఠాక్రేకు చెప్పారు. నాన్ బీజేపీ సీఎంల సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఒకసారి సారు ఫెడరల్ ఫ్రంట్ పెడతానని హూంకరించారు. అప్పుడు కొన్ని కారణాలవల్ల వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ మంచి కాక మీద ఉన్నారు. సహజంగానే మంత్రులు, నాయకులు కూడా రెచ్చిపోతున్నారు.

 మోడీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడతానని ప్రకటించగానే దేశానికి కాబోయే ప్రధాని కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. పండగ చేసుకున్నారు. కలలు  కన్నారు. సేమ్ అదే సీన్ ఇపుడు రిపీట్ చేస్తున్నారు. కేసీఆర్ ను జాతీయ నేతగా ప్రచారం చేస్తున్నారు. అందుకు పుట్టిన రోజును ఉపయోగించుకుంటున్నారు. తగ్గేదేలే  అంటున్నారు. 

మంత్రులు, నాయకులందరూ కేసీఆర్ ప్రధాని కావాలంటూ ఈరోజు హిందూ దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేశారు. కేసీఆర్ కూతురు కమ్ ఎమ్మెల్సీ అయిన కవిత కాలి నడకన అంటే మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్ళింది. అలిపిరి నుంచి మెట్ల దారిలో వెళ్లి స్వామిని దర్శించుకుంటానని చెప్పింది. సార్ ప్రధాని అయితే దేశ చరిత్రనే మారుస్తారని చెబుతున్నారు గులాబీ పార్టీ నాయకులు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పితే మోడీ పని ఖతమేనని, మోడీ వెళ్ళిపోయి కేసీఆర్ ప్రధాని కావాలని అంటున్నారు. తెలంగాణను నెంబర్ వన్ చేసిన కేసీఆర్ దేశాన్ని కూడా నెంబర్ చేస్తారని చెబుతున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గొప్పగా చెబుతున్నారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ జోరుగా జరుగుతున్నాయి. 

బీజేపీ ఇలాకా అయిన గుజరాత్ తో పాటు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలోనూ.. కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు జోరుగా దర్శనమిస్తున్నాయి. దేశ్ కీ నేతా.. కేసీఆర్ అంటూ ఇంగ్లిష్ లో, హిందీలో జరుగుతున్న ఈ ప్రచారాలు.. అక్కడి ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో.. హైదరాబాద్ లో చదువుకుని… తర్వాత వారణాసిలో స్థిరపడ్డాడు. అప్పటినుంచి కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని.. ఇవాళ ఈ ప్రచారంతో నిరూపించుకున్నాడు.

ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించిన సందర్భం కూడా ఇందుకు తోడైంది. ఇది చివరికి.. వారణాసివ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిసి.. జాతీయ స్థాయి చర్చ జరిగేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇక ఢిల్లీ వంతు. దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ భవన్ తో పాటు.. కేసీఆర్ నివాసం దగ్గర కూడా.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కటౌట్లు, ఫ్లెక్సీలతో సందడి కనిపిస్తోంది. 

జాతీయ రాజకీయాల్లో కాలు మోపాలన్న కేసీఆర్ దూకుడుకు మరింత ఊతం కల్పించేలా.. ఈ ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. అనాథాశ్రమంలో కేక్ కట్ చేశారు. పిల్లలకు పుస్తకాలు పంచారు. ఒడిశాలోనూ కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని తాకుతున్నట్టుగా జరుగుతున్నాయి. పూరీలోని సముద్ర తీరం వద్ద సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన కేసీఆర్ సైకత శిల్పం.. అదుర్స్ అనిపించేలా ఉంది.

సిద్దిపేటకు చెందిన వంగా రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో సుదర్శన్ పట్నాయక్.. ఈ సైకత శిల్పం రూపొందించారు. ఈ క్రమంలో.. కేసీఆర్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో వెలుస్తున్న ఫ్లెక్సీలు, దేశ్ కీ నేతా కేసీఆర్ మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు కూడా తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా జాతీయ మీడియాలో చేస్తున్న హడావుడి.. ఆసక్తికరంగా మారింది. నేషనల్ న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, భారీ ప్రకటనలు, విజనరీ లీడర్ అంటూ కేసీఆర్ కు ఫుల్ లెంగ్త్ హైప్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే.. ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న కేసీఆర్ కు.. తమిళనాడు సీఎం స్టాలిన్ బెంగాల్ సీఎం మమత నుంచి మద్దతు లభించింది. త్వరలోనే మహారాష్ట్ర సీఎంతోనూ కేసీఆర్ లంచ్ మీటింగ్ చేయబోతున్నారు.

ఇలా.. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వాయిస్ రైజ్ చేస్తున్న కేసీఆర్ కు.. ఆయన బర్త్ డే కూడా.. కలిసి వచ్చేలా ప్లాన్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు సక్సెస్ అవుతున్నారు. అంటూ వినిపిస్తున్న నినాదాలు.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఢిల్లీలో అయితే.. ఏకంగా 70 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ సంబరాల హడావుడి.. జాతీయ రాజకీయాలను, అక్కడి పార్టీల నేతలను మాత్రం ఆలోచనలో పడేస్తున్నాయని అంతా భావిస్తున్నారు. ముందు ముందు ఈ హడావుడి ఎక్కడి వరకూ వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.