కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు మరోసారి పెద్ద ప్రమాదం తప్పింది. హోన్నావర్ లోని రామతీర్ధం కొండ వద్ద ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండైన కొద్దిసేపటికే హెలిప్యాడ్లో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు.
మూడు రోజుల క్రితం కూడా శివకుమార్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ను డేగ ఢీకొట్టింది. దాంతో హెలిక్యాప్టర్ అద్దం ఒకవైపు పూర్తిగా పగిలిపోయింది. హెలిక్యాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్దగా ఎవరికీ ఏమీ కాలేదు. గత మూడు రోజుల వ్యవధిలో ఆయనకు రెండు సార్లు ప్రమాదం తప్పింది.
కర్నాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి నిమిషాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తూ, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది.