టాలీవుడ్ అగ్రహీరో, దివంగత ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ విస్మరించినా, తెలంగాణ గుర్తించింది. ఇందుకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆహ్వానించడమే నిదర్శనం. ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ను ఆహ్వానించారు.
గన్నవరం విమానాశ్రయానికి నందమూరి బాలకృష్ణ వెళ్లి రజినీకాంత్కు స్వాగతం పలికి మరీ తీసుకెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించకపోవడం విమర్శలకు దారి తీసింది.
తన కుమారుడు లోకేశ్కు రాజకీయంగా థ్రెట్ అవుతారనే భయంతోనే జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్పై ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆ దివంగత నేత మనవడు జూనియర్ ఎన్టీఆర్ను తెలంగాణ మంత్రి పువ్వాడ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. దివంగత ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ను గుర్తించడం వల్లే విగ్రహావిష్కరణకు ఆహ్వానించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ ఉద్దేశ పూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టినంత మాత్రాన, ఆయన్ను లోకం మరిచిపోతుందని అనుకోవడం చంద్రబాబు అజ్ఞానం అవుతుందనే టాక్ నడుస్తోంది.