చంద్రబాబు ఏం చేసినా అందులో ఏదో రాజకీయం ఉండకపోదనే వారు చాలా మందే ఉన్నారు. ప్రత్యర్థులు అయినా, ఆయన సొంత పార్టీ వాళ్లు అయినా చంద్రబాబులో ఇలాంటి రాజకీయాలనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి సభ అంటూ ఉన్నట్టుండి రజనీకాంత్ ను తెరపైకి తీసుకురావడం వెనుక చంద్రబాబు మార్కు స్ట్రాటజీలు ఏవో ఉండనే ఉంటాయని అనుకునే వాళ్లు లేకపోలేదు.
ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని స్పందిస్తూ పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేయడానికే రజనీకాంత్ ను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. చంద్రబాబు రాజకీయాలు పవన్ కు అర్థం కాకపోవచ్చని, ఇదంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అని నాని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా.. ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు రజనీకాంత్ ఎక్కడున్నారు? అని కొడాలి ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన వారంతా ఇప్పుడు ఆయన శతజయంతి చేస్తున్నారంటూ కొడాలి విరుచుకుపడ్డారు.
కొడాలి వెర్షన్ అలా ఉండగా.. రజనీతో రాసుకుపూసుకుని చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా ఏమైనా చేస్తుండే అవకాశాలూ లేకపోలేదు. సంక్షోభంలోనే తను అవకాశాలను వెదుక్కొంటానంటూ చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. సొంతంగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం పక్క చూపులు చూస్తున్న చంద్రబాబు నాయుడు ఇటీవలే మోడీ భజన అందుకున్నారు. ఎలాగైనా బీజేపీతో పొత్తు కోసం ఆయన అర్రులు చాస్తున్నారు.
మరి ఇప్పుడు రజనీకాంత్ తో ఈ సాన్నిహిత్యం కూడా కమలం పార్టీని ప్రసన్నం చేసుకునే యత్నాల్లో ఒకటి కావొచ్చు. బీజేపీ వాళ్లకు రజనీకాంత్ సన్నిహితుడే. తమిళనాట రజనీని బరిలోకి దించాలని బీజేపీ చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఆరోగ్యం, అపనమ్మకం ఈ రెండు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని అపేశాయి. మరి ఇప్పుడు అలాంటి రజనీకాంత్ చేత చంద్రబాబు నాయుడు బీజేపీకి ఏవైనా సిపార్సులు చేయించుకుని పొత్తు యత్నాలు చేస్తుండవచ్చు కూడా!