ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, రాష్ట్ర విభజనను సరిగా చేపట్టలేదని, విభజన బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరగలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఇవన్నీ నిస్సందేహంగా నిజాలే. కాంగ్రెస్ ను నిందించే క్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందంటున్న మోడీజీ, తన హయాంలో ఏం జరుగుతోందో? అనే అంశం గురించి గమనించడం లేదా! తన పార్టీ ఏపీకి ఏం చేస్తోందనేది గ్రహించడం లేదా? ఈ విషయాలను ప్రజలు గమనించడం లేదని మోడీ అనుకుంటున్నారా?
కాంగ్రెస్ అన్యాయం చేసింది సరే, బీజేపీ చేసిన అన్యాయం మాటేంటి? అనేదానికి మోడీ ఇప్పటి వరకూ సమాధానం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ఎంత దారుణమైన విభజన బిల్లును ప్రవేశ పెట్టినా, బీజేపీకి దానికి ఆ రోజు మద్దతు పలికింది. చిన్న రాష్ట్రాలు తమ విధానం అని, తెలంగాణకు తాము అనుకూలం అంటూ బీజేపీ అప్పట్లోనే ప్రకటించింది. తెలంగాణ పోరాటంలో క్రెడిట్ తీసుకుంది. తెలంగాణకు సోనియా పెద్దమ్మ అంటే తను చిన్నమ్మను అంటూ నాటి బీజేపీ ముఖ్యనేత సుష్మా స్వరాజ్ ప్రకటించుకున్నారు కూడా!
మరి ఇంత చేసి ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం గురించి మాట్లాడారు. మంచిదే. మరి ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ ఇచ్చిన హామీల మాటేంటి? ఐదు, ఐదు కాదు పది, పది కాదు పదిహేనేళ్లు అంటూ 2014 ఎన్నికల ముందు బీజేపీ నేతలు హామీలు ఇవ్వలేదా? తమ పార్టీ మెనిఫెస్టోలో ప్రత్యేకహోదాను చేర్చలేదా? మరి ఆ తర్వాత బీజేపీ హోదాపై మోసం చేయడం లేదా?
ఇక పోలవరం ప్రాజెక్టు మాటేంటి? హోదా అంటే విభజన చట్టంలో లేదంటారు. తాము హామీ ఇచ్చిన విషయాన్ని కన్వీన్సింగ్ గా మరిచిపోతారు. మరి విభజన చట్టంలోని పోలవరం ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల అంశం ఎందుకు నాన్చుతున్నారు.
నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రాజెక్టు ఎలా పూర్తయినట్టు? ఈ యేటి బడ్జెట్ లో పోలవరానికి కేటాయించిన నిధులెన్ని? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందనే అర్హత మోడీకి ఉంటుందా? ఈయన చేసిన న్యాయం ఏమీ లేకపోగా కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ తను చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నట్టున్నారు శ్రీమాన్ నరేంద్రమోడీ.