ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ టీడీపీలో చేరబోతున్నారంటూ వస్తున్నా ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ దాదాపు రెండు గంటల పాటు రాజకీయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గ్రూప్ లు నడిపిన ఇరువురు భేటీ కావడం విశేషం. అతి తర్వలో శైలజానాథ్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి తిరిగి టీడీపీ సీటు ఆశిస్తున్నారు. కానీ నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని ఎన్నికల్లో ఢీ కొట్టాలంటే బండారు శ్రావణి కంటే శైలజానాథ్ నే బెటర్ అని టీడీపీ అధినేత భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శింగనమల నియోజకవర్గంలో పట్టు ఉన్న జేసీ ఫ్యామిలీ సపోర్ట్ కోసం శైలజానాధ్ జేసీని తన ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
కాగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీఫారాన్ని సైతం శైలజానాథ్ చేతుల్లోంచి జేసీ పవన్ లాక్కొన్నారు. ఎవరు పోటీ చేసినా ఫర్వాలేదు శైలజానాథ్ వద్దన్నట్టుగా జేసీ ఫ్యామిలీ వ్యవహరించింది. చివరకు అప్పుడు యామినిబాలకు టికెట్ దక్కింది. అయితే 2019లో పూర్తిగా తమ మనిషిని బరిలోకి దించారు జేసీ కుటుంబీకులు. టీడీపీ తరఫున బండారు శ్రావణిని బరిలోకి దించారు. అయితే ఆమె ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. తీరా ఇప్పుడు జేసీ వర్గం శైలజానాథ్ కు ఎంత వరకు సపోర్ట్ చేస్తుందనేది చూడాలి.