వైసీపీకి ష‌ర్మిల భారీ షాక్‌

వివేకా హ‌త్య కేసులో వైఎస్ ష‌ర్మిల త‌న అన్న పార్టీ వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. వివేకా హ‌త్య‌కు సంబంధించి వైసీపీ గ‌త కొంత కాలంగా చేస్తున్న వాద‌న‌కు పూర్తి విరుద్ధంగా ష‌ర్మిల షాకింగ్…

వివేకా హ‌త్య కేసులో వైఎస్ ష‌ర్మిల త‌న అన్న పార్టీ వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. వివేకా హ‌త్య‌కు సంబంధించి వైసీపీ గ‌త కొంత కాలంగా చేస్తున్న వాద‌న‌కు పూర్తి విరుద్ధంగా ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ష‌ర్మిల మీడియా మాట్లాడుతూ ఆస్తి కోసం తండ్రిని సునీత‌, ఆమె భ‌ర్త చంపించార‌న‌డంలో వాస్త‌వం లేద‌న్నారు. 

ఎందుకంటే సునీత పేరుపై ఏనాడో ఆస్తుల్ని క్రియేట్ చేసిందే వివేకానంద‌రెడ్డి అని ఆమె అన్నారు. చిన్నాన్న‌, చిన్న‌మ్మ‌ల పేర్ల‌పై ఆస్తులు లేవ‌న్నారు. ఒక‌వేళ ఒక‌టో అరో వివేకా పేరుపై ఆస్తులుంటే, త‌న త‌ద‌నంత‌రం సునీత పిల్ల‌ల‌కు చెందేలా వీలునామా త‌న చిన్నాన్న వివేకా రాయించార‌ని ష‌ర్మిల సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టారు. ఒక‌వేళ ఆస్తి కోస‌మే అయితే వివేకాను కాకుండా సునీత‌ను భ‌ర్త చంపి వుండాల్సింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

వివేకా వ్య‌క్తిగ‌త జీవితాన్ని హ‌న‌నం చేసేలా ప్ర‌చారం చేయ‌డంపై ష‌ర్మిల ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది చాలా అన్యాయ‌మ న్నారు. జీవించి లేని వ్య‌క్తిమీద‌, సంజాయిషీ ఇచ్చుకోలేని వ్య‌క్తిమీద, ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని చిలువ‌లుప‌లువ‌లుగా రాయ‌డం ఖండించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. వివేకా ప్ర‌జ‌ల మ‌నిషి అన్నారు. ప్ర‌జానాయ‌కుడైన చిన్నాన్న గురించి త‌మ‌కంటే పులివెందుల‌, క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. ఎవ‌రైనా స‌మ‌స్య‌తో వ‌స్తే దాన్ని చిన్నాన్న ఎప్పుడూ త్రుణీక‌రించ లేద‌న్నారు.

స‌మ‌స్య‌తో వ‌చ్చిన వారిని వెంట‌బెట్టుకుని క‌లెక్ట‌ర్ ఆఫీస్‌కైనా, చిన్న పంచాయ‌తీ కార్యాల‌యానికైనా త‌నే వెళ్లి ప‌రిష్క‌రించేవార‌ని ష‌ర్మిల చెప్పుకొచ్చారు. ప్ర‌జానాయ‌కుడైన చిన్నాన్న వ్య‌క్తిగ‌త జీవితాన్ని హ‌న‌నం చేసేలా కొన్ని మీడియా సంస్థ‌లు మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. మీడియా హౌస్‌ల‌కు విలువ‌లు ఉండాల‌ని ష‌ర్మిల హిత‌వు చెప్పారు. విలువ‌లు లేని మీడియా సంస్థ‌లు విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతాయ‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా వుండ‌గా ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌న్నీ వైసీపీ, సాక్షి మీడియా గ్రూప్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన‌వే. ఈ నెల 22న సాక్షి దిన‌ప‌త్రిక ప్ర‌ధాన సంచిక‌లో ఫ‌స్ట్ పేజీలో వివేకాపై క‌క్ష గ‌ట్టింది ఆ ఇద్ద‌రే..శీర్షిక‌తో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఆస్తి, రాజ‌కీయ వార‌స‌త్వం కోస‌మే కుట్ర అంటూ సాక్షి క‌థ‌నం  రాసింది. సీబీఐకి వివేకా రెండో భార్య ష‌మీమ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సాక్షి క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇందులో ఆస్తిపై అల్లుడైన చిన‌బామ్మ‌ర్ది న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, అలాగే రాజ‌కీయ వార‌స‌త్వంపై  పెద్ద బామ్మ‌ర్ది క‌న్నేశారంటూ ష‌మీమ్ వాంగ్మూలం పేరుతో రాయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఈ క‌థ‌నంలో వివేకా త‌న రెండో భార్య‌, కుమారుడితో ఉన్న‌ట్టు సాక్షి ప‌త్రిక ఓ ఫొటోను కూడా ప్ర‌చురించింది.

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు వైసీపీ నేత‌లు గ‌త కొంత‌కాలంగా సునీత‌, ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర‌రెడ్డిల పాత్ర‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వివేకా రెండో పెళ్లి, కుమారుడు, ఆస్తుల గొడ‌వ అంశాల్ని బ‌లంగా చెబుతున్నారు. వివేకా హ‌త్య‌తో అవినాష్‌రెడ్డికి సంబంధం లేద‌ని చెప్పే క్ర‌మంలో వైసీపీ పెద్ద‌లు చేస్తున్న వాద‌న‌కు కౌంట‌ర్ అన్న‌ట్టుగా ష‌ర్మిల ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా త‌న అన్న సొంత ప‌త్రిక‌ను దృష్టిలో పెట్టుకుని ప‌రోక్షంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వివేకా హ‌త్య‌పై ష‌ర్మిల తాజా కామెంట్స్ వైసీపీకి డ్యామేజీ అని చెప్ప‌క త‌ప్ప‌దు.