ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబునాయుడి ర్యాలీపై మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో రాళ్ల దాడి జరిగిందని టీడీపీ, ఇతర ప్రతిపక్షాల నేతలు, అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై ఎలాంటి దాడి జరిగినా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అయితే చంద్రబాబుపై దాడి ఘటనను మీడియా ముందు విమర్శించడానికే పరిమితం కాకూడదు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు లాంటి నాయకులు నేరుగా రంగంలోకి దిగి, సొంత పార్టీ అయిన వైసీపీకి చుక్కలు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇక సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు వుంది. ఇప్పటికీ ఆయన ఢిల్లీలో కూచుని సీఎం జగన్, అలాగే వైసీపీ ప్రభుత్వ పెద్దల్ని విమర్శిస్తూ కూచోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఆయన ఫలానా పార్టీలో చేరుతారంటూ బీజేపీ, జనసేన, టీడీపీ పేర్లు వినిపిస్తున్నాయి. వైసీపీ కాకుండా రఘురామకు ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదు. అయితే ఎన్నికల బరిలో నిలబడాలంటే క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యకలాపాలు చేయాల్సి వుంటుంది.
రఘురామ మాత్రం ఢిల్లీలో కూచొని మాటలు కోటలు దాటేలా మాట్లాడుతున్నారు. ఆయన మాత్రం ఢిల్లీ హద్దులు దాటి ఇటువైపు రానుగాక రారు. అదేంది సార్, మీలాంటి వాళ్లే వైసీపీ ఆగడాలను అడ్డుకోకపోతే, ఇంకెవరు ముందుకొస్తారని ఎవరైనా అభిమానంతో ప్రశ్నిస్తే, ఆయన పిచ్చి చూపులు చూస్తారు.
గతం తాలూకూ సీఐడీ దెబ్బల్ని, కాళరాత్రిని గుర్తు చేసి, జగన్ సర్కార్పై మరింత రెచ్చిపోతారు. తాజాగా చంద్రబాబునాయుడి కాన్వాయ్పై వైసీపీ శ్రేణుల దాడిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఆయన చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వుందని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు.
ఈ లేఖలు, విమర్శలు పని చేయవు సార్ అని చెబితే రఘురామకు అర్థం కావడం లేదు. ఏపీ బరిలో మీరు దిగితే తప్ప, సీఎం జగన్ తిక్క కుదరదని నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా రఘురామ పట్టించుకోవడం లేదని అంటున్నారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కంటే, రఘురామ ఇచ్చే మనోధైర్యమే ఎక్కువ రక్షణ కల్పించే అవకాశాలున్నాయి. రఘురామ ఏపీకి వెళ్లి అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ మంత్రులు, శ్రేణుల భరతం పట్టాలి. ఏపీలో రఘురామకు మంచి క్రేజ్ వుంది. ఆయన్ను అభిమానించే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
రఘురామ అందరి వాడు. కమాన్ రఘురామ.. ఒఠ్ఠి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టు. ఎన్నికలు ముంచుకొస్తున్నా, మాటలతో కాలయాపన చేయడం మంచిది కాదు. ఏపీ గురించి అన్నీ తెలిసిన మీ లాంటి ధీరోదాత్త నాయకులు లేకపోవడం వల్లే ఆ రాష్ట్రంలో అధికార పార్టీ చెలరేగిపోతోంది. మీరిక ఎంత మాత్రం ఆలస్యం చేయొద్దు. మంచి పనికి ముహూర్తాలు, ఎక్సెట్రా చూసుకోవాల్సిన అవసరం లేదు.
జగన్ సర్కార్తో పోరాడితే పోయేదేమీ లేదని మీకు తెలియంది కాదు. కమాన్ రఘురామ, కమాన్…మాటలు కట్టిపెట్టి, చేతలకు పని చెప్పండి సార్!