2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై టీడీపీ దాడి మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లాలో చంద్రబాబునాయుడిపై వైసీపీ రాళ్ల దాడికి దిగిందంటూ టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఘటనపై టీడీపీ చాలా సీరియస్ అయి…కేంద్ర హోంశాఖకు లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణతో ఫిర్యాదు చేయించింది.
ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న చంద్రబాబుపై దాడిని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుని, జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తుందనే రీతిలో టీడీపీ ప్రచారం చేస్తోంది. నాడు కేంద్రహోంశాఖ మంత్రిపైన్నే టీడీపీ దాడి చేస్తే, ఇంత వరకూ చర్యలకు తీసుకునే దిక్కులేదంటూ వైసీపీ చురకలు అంటిస్తోంది. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబుపై దాడి అంశాన్ని పెద్దది చేసి చూపుతు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు పాలనలో నియమ నిబంధనలేవీ వర్తించవని, ఏం జరిగినా తెలుగు ప్రజానీకం శ్రేయస్సు కోసమే అన్న రీతిలో ప్రచారం చేయడం టీడీపీ నుంచి నేర్చుకోవాలనే సెటైర్స్ పేలుతున్నాయి. వీఐపీ భద్రతకు సంబంధించి స్టాండింగ్ ఆర్డర్లను స్థానిక పోలీసులు ఉల్లంఘించారని కేంద్రహోంశాఖకు టీడీపీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని పిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై వైసీపీ రాళ్ల దాడిని ఎన్ఎస్జీ హెడ్క్వార్టర్స్ సీరియస్గా తీసుకుందని ఎల్లో మీడియా తన మార్క్ కథనాల్ని తెరపైకి తేవడం గమనార్హం. ఇలాంటివేవో తమ పాలనలో సక్రమంగా అమలు చేసి, వ్యవస్థల్ని బలోపేతం చేయగలిగి వుంటే నేడీ సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు.
బాబు పాలనలో ఏకంగా కేంద్రహోంశాఖ మంత్రిపై దాడి చేయడమే కాకుండా, రాష్ట్రానికి అన్యాయం చేసిన కారణంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారనడం గమనార్హం. ప్రతి ఘటనను తనకు అనుకూలంగా మలుచుకోవాలని టీడీపీ చూసినా, కాలం మాత్రం అన్నింటిని గుర్తు పెట్టుకుని చురకలు అంటిస్తూ వుంటుంది.