శ్రీదేవి మరణంపై తొలిసారి నోరువిప్పిన భర్త బోనీ

అతిలోకసుందరి శ్రీదేవి, దుబాయ్ లోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్ పై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు.…

అతిలోకసుందరి శ్రీదేవి, దుబాయ్ లోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్ పై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దుబాయ్ పోలీసులు మరింత డౌట్ పడ్డారు.

అయితే శ్రీదేవి మరణించిన తర్వాత తన భార్య మృతిపై ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు బోనీకపూర్. భార్య లేని లోటును, ఆ బాధను మాత్రమే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లకు శ్రీదేవి మరణంపై తన అనుమానాలను బయటపెట్టారు బోనీ.

శ్రీదేవి కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుందట. ఉప్పు-కారం లేని ఆహారం తీసుకుంటుందట. అది కూడా చాలా తక్కువ మోతాదులో. అందుకే కొన్నిసార్లు ఆమె కళ్లుతిరిగి పడిపోతుందంట.

“ఆమె తరచుగా ఆకలితో అలమటించేది. అందంగా కనిపించడం కోసం, మంచి ఆకృతిలో ఉండడం కోసం శరీరాన్ని కష్టపెట్టేది. శ్రీదేవికి లో-బీపీ ఉంది. ఆహార నియమాల్ని సడలించాలని వైద్యులు ఎన్నోసార్లు ఆమెకు చెప్పారు. కానీ ఆమె వినలేదు. శ్రీదేవి మరణం యాక్సిడెంటల్.”

ఇలా తన భార్య మృతిపై తొలిసారి స్పందించారు బోనీ. చనిపోయే టైమ్ లో కూడా శ్రీదేవి కఠినమైన డైట్ లో ఉందట. అందువల్లనే కళ్లుతిరిగి బాత్ టబ్ లో పడిపోయి ఉంటుందని బోనీ అనుమానం వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ పోలీసులు మాత్రం బోనీని చాలా అనుమానించారట.

ఏకంగా 24 గంటల పాటు బోనీ కపూర్ ను ప్రశ్నించారట పోలీసులు. ఇండియా మీడియా నుంచి చాలా వత్తిడి ఉందని, కాబట్టి ప్రశ్నించక తప్పదని చెప్పారట. అక్కడితో ఆగకుండా బోనీ కపూర్ కు లై-డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించారట. అలా పూర్తిస్థాయిలో విచారణ జరిపి, శ్రీదేవి ప్రమాదవశాత్తూ మరణించిందని దుబాయ్ పోలీసులు నివేదిక ఇచ్చారు.

శ్రీదేవి మరణించిన తర్వాత బోనీని కలిసి సానుభూతి తెలిపిన హీరో నాగార్జున కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడట. షూటింగ్ టైమ్ లో ఆమె 2సార్లు కళ్లు తిరిగి పడిపోవడం తను కళ్లారా చూశానని నాగార్జున, బోనీకి చెప్పారట. ఓసారి తన సినిమా షూటింగ్ లో బాత్రూమ్ లో కళ్లుతిరిగి పడిపోయిందని, అప్పుడు ఆమె పన్ను కూడా విరిగిందని నాగార్జున, బోనీకి చెప్పారట.