విశాఖ ఆక్టోపస్ జోస్యం….2024లో ఆయనే సీఎం

తెలుగు రాష్ట్రాలకు అక్టోపస్ గా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపల్ పేరు ప్రసిద్ధి. ఆయన బాటలోనే మరొకరు ఉన్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని వైజాగ్ అక్టోపస్ గా పిలుస్తారు. ఆయన…

తెలుగు రాష్ట్రాలకు అక్టోపస్ గా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపల్ పేరు ప్రసిద్ధి. ఆయన బాటలోనే మరొకరు ఉన్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని వైజాగ్ అక్టోపస్ గా పిలుస్తారు. ఆయన రాజకీయ జోస్యాలు బాగా తెలుసుకుని మసలుకుంటారు.

ఏ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అన్నది ఆయన ముందుగానే పసిగట్టి దానికి తగినట్లుగానే కుదురుకుంటారని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. నాలుగేళ్ల పాటు గంటా తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా అనిపించారు. ఇపుడు కనిపిస్తున్నారు. యాక్టివ్ అయ్యాను అని అంటున్నారు.

చంద్రబాబు పుట్టిన రోజున గంటా విశాఖ ఆక్టోపస్ గా మారి జోస్యం చెప్పారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో ఏపీకి 2024లో చంద్రబాబు సీఎం కావడం అంతే నిజం అని గంటాపధంగా చెప్పారు. చంద్రబాబు పాలనను ఆయన పాలిచ్చే ఆవుతో పోల్చారు. 2019లో బాబుని కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని గంటా ప్రజలనే ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలలో మొదటి స్థానంలో ఉందని బండలు వేశారు. నాలుగేళ్ళుగా ఏపీకి చేసింది ఏమీ లేదని ఇపుడు పోర్టులు ఎయిర్ పోర్టులు కడతామంటే ఎవరు నమ్మాలి అంటున్నారు గంటా.

విశాఖకు రాజధాని అంటే కూడా ఎవరూ నమ్మరని గంటా అంటున్నారు. ఇదే గంటా గతంలో జై విశాఖ రాజధాని అని నినదించిన సంగతిని మరచారు అని ప్రత్యర్ధ్యులు అంటున్నా ఆయన ఇపుడు పక్కా టీడీపీవాది. తెలుగుదేశంలో సిసలైన తమ్ముడు. బాబు పాలన వస్తుందని బల్లగుద్ది చెబుతున్న వీర సైనికుడు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో ఆయన ఏమన్నారో మరచిపోవాల్సిందే అని అంటున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనకు ఏడాది పైగా సమయం ఉంది. చంద్రబాబు కడప టూర్ లో మాట్లాడుతూ ఏమీ లేదు మొత్తం ప్రభుత్వం టైం అయిపోయింది అని చెప్పారు. ఇపుడు గంటా దాన్ని అనుసరిస్తూ నెలలు లేవు కేవలం రోజులకు వైసీపీ పాలన వచ్చేసింది అని అంటున్నారు. అంటే ఏపీలో మే లో ఎన్నికలు జరుగుతాయని గంటా భావిస్తున్నారా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. 

ఆత్రానికి బాబుకు తగిన తమ్ముళ్ళు అనే సెటైర్లు పడుతున్నాయి. అయితేనేమి గంటా మాటలు ఇపుడు తెలుగుదేశానికి ఆక్సిజన్ గా పనిచేస్తున్నాయి. బాబు రావాలి అని ఆయన నినదిస్తున్నారు.