విజయవాడ భవానీపురంలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దుర్ఘటనపై వైసీపీ ఫైర్బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ నేత వినోద్జైన్ వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ తనను కాపాడుతారనే ధైర్యంతోనే టీడీపీ నాయకుడు సదరు బాధిత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
ఒకవైపు టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు.
నిజంగా టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం వుంటే భవానీపురంలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఇంటి ముందు నారీ సంకల్ప దీక్ష చేస్తే …ప్రజలు వారిని దేంతో కొట్టాలో దాంతో కొడ్తారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు పనులన్నీ చేస్తూ ఎవరిపైన్నో నెడుతూ టైంపాస్ చేస్తామనే రీతిలో టీడీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో మహిళల జీవితాలను టీడీపీ నేతలు ఏ విధంగా నాశనం చేశారో చూశామన్నారు. వాటిని ప్రశ్నించిన తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని రోజా గుర్తు చేశారు.
అదే విధంగా సిన్సియర్ ఆఫీసర్ వనజాక్షిని ఏ విధంగా కొట్టారో చూశామన్నారు. చదువుల తల్లి రుషితేశ్వరిని టీడీపీ హయాంలో ఏ విధంగా చంపేశారో మనం చూశామన్నారు. తాజాగా భవానీపురంలో బాలికను పొట్టన పెట్టుకున్న టీడీపీ నేతలకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
బాలిక చివరి కోరికైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని ఆమె విన్నవించారు. భవిష్యత్లో ఎవరైనా అమ్మాయిల పట్ల అఘాయిత్యాలకు పాల్పడాలంటే భయపడేలా శిక్ష ఉండాలని రోజా ఆకాంక్షించారు.