తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 31 నుంచి స్కూళ్లు, కాలేజీల రీ ఓపెన్ కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. ఒకవైపు కరోనా వేవ్ కొనసాగుతూ ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే మొగ్గు చూపింది. సంక్రాంతి సెలవుల సమయం నుంచి తెలంగాణలో స్కూళ్లను మళ్లీ తెరవలేదు. ఇప్పుడు కేసుల సంఖ్యలేమీ తగ్గకపోయినా.. స్కూళ్లను తెరవడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతూ ఉంది.
మరి ఏపీలో రెండు వారాల కిందటే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. అప్పట్లో ఒక రేంజ్ లో రెచ్చిపోయారు తెలుగుదేశం ఆశాకిరణం లోకేషూ, జనసేన నంబర్ టూ నాదెండ్ల మనోహర్. ఏపీలో సంక్రాంతి తర్వాత స్కూళ్లను తెరవడానికి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. వీళ్లు గయ్యి మన్నారు.
పరీక్షలు రద్దు చేయాలి, స్కూళ్లను మూసి వేయాలనే డిమాండ్లతో… స్కూలు ఎగ్గొట్టాలని చూసే పిల్లల పాలిట ఆప్తుడు అయిన నారా లోకేష్ .. తన తెలివి తక్కువ డిమాండ్ పట్ల ఇప్పుడు సిగ్గుపడాలి. తెలంగాణలో స్కూళ్లను తెరిచారని కాదు, అనేక మంది సామాజిక వేత్తలు, పరిశోధకులూ, విజ్ఞులు, మేధావులు, వైద్య పరిశోధకులు కూడా.. కరోనా పేరుతో స్కూళ్లను మూసి వేసి ఉంచడం సరికాదని చెబుతూ వచ్చారు.
దీని వల్ల తీవ్ర దుష్ఫరిణామాలు ఉంటాయని వారు విశ్లేషించారు. ప్రత్యేకించి ఇండియా వంటి దేశంలో స్కూళ్లను మూసి వేయడం అంటే.. రేపటి పౌరుల జీవితాలను కాలరాయడమే అని వారు హెచ్చరించారు. పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, అనేక సామాజిక దుష్పరిణామాలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రెండో వేవ్ సమయంలో కొన్ని నెలల పాటు స్కూళ్లను మూసి వేయడాన్నే వారు తప్పుపట్టారు. కరోనా ప్రభావం పిల్లలపై తక్కువ అని స్పష్టమవుతున్నా ప్రభుత్వాలు ఎందుకు స్కూళ్లను మూసి వేసి ఉంచుతున్నాయని ప్రశ్నించారు.
అంతే కాదు.. తల్లిదండ్రులేమో పెళ్లిళ్లకూ, పేరంటాలకూ తిరుగుతారు. షాపింగ్ కాంప్లెక్స్ లలో పిల్లలతో కలిసే విహరిస్తారు. థియేటర్లకు తీసుకెళతారు… ఎటొచ్చీ స్కూళ్లకు వెళితే మాత్రం ప్రమాదమనే వాదన కూడా విమర్శలకు గురయ్యింది.
మరి ఈ పరిస్థితులన్నింటినీ సమీక్షించుకుని.. కరోనా పేరు చెప్పి స్కూళ్లను మూసి వేస్తే పని జరగదనే లెక్కతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే మొగ్గు చూపింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించేస్తే చాలు అనే లెక్కతో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ లాంటి వారు రచ్చ చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై తెగ ఇదైపోయారు. వీళ్ల కోరికకు అనుగుణంగా స్కూళ్లను మూసి వేసిన పక్క రాష్ట్రాలు కూడా తమ నిర్ణయాలను సమీక్షించుకుంటున్నాయి. మరి ఇలాంటి రియలైజేషన్ నాదెండ్ల, నారా లోకేష్ లాంటి వాళ్ల నుంచి అయినా ఎక్స్ పెక్ట్ చేయొచ్చా?