ఇటీవలే ఏపీ ప్రభత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించగా, ఈ అంశంపై ఏపీ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏపీ ప్రభుత్వం ఎడ్డెమంటే, తెడ్డెం అనే రఘురామ చింతామణి నాటక ప్రదర్శనపై కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
ఈ నిషేధం కొందరి జీవించే హక్కును హరించడమే అని రఘురామ అంటున్నారు! ఈ నాటక ప్రదర్శన మీద ఆధారపడిన వారి జీవించే హక్కును ప్రభుత్వ నిర్ణయం హరించి వేస్తోందనేది రఘురామ వాదనగా తెలుస్తోంది! మరి నాటకం ఆడే జీవించాలనుకుంటే.. చింతామణి మాత్రమేనా? వేరే నాటకాలే లేవా? అనే లాజిక్ ను రఘురామ మరిచారో ఏమో!
ఈ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఆర్య వైశ్య సంఘాన్ని రఘురామ ప్రతివాదులుగా చేర్చారు. చింతామణి నాటకం ప్రదర్శన కాలక్రమంలో పూర్తిగా బూతుగా మారడంతోనే ఆర్య వైశ్య సంఘాలు ప్రతిఘటించాయి.
రచనలో చింతామణి నాటకాన్ని ఎవ్వరూ తప్పు పట్టలేరు. అయితే..ప్రదర్శనలో మాత్రం రూటు మారింది. కాలక్రమంలో సుబ్బిశెట్టి పాత్రను వెగటుపుట్టించే బూతుగా మార్చారు కొందరు ప్రదర్శన కారులు.
ఈ అంశమే ఆర్య వైశ్యులను చివుక్కుమనిపించింది. దీంతో నిషేధం డిమాండును చాన్నాళ్లుగా చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నిషేధించింది. నిషేధం ప్రదర్శన వరకే. మరి చింతామణి ప్రదర్శనపై నిషేధాన్ని ఎత్తి వేసి.. నాటక కళను బతికించాలంటున్న రఘురామకు కోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో!