జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వివాదం తలెత్తింది. ప్రభుత్వం తాను చెబుతున్నట్టుగా పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించి వుంటే సమస్యే ఉండేది కాదు. రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కాకుండా, ఆ నియోజక వర్గం పరిధిలోని రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా తెరపైకి వచ్చింది. దీంతో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
రైల్వేకోడూరు నుంచి రాయచోటికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు. దీంతో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, లేదంటే తమను శ్రీబాలాజీ జిల్లా (తిరుపతి)లో కలపాలని రైల్వేకోడూరు నియోజకవర్గ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్పై రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద నియోజకవర్గ వాసులు రిలే దీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ రాజంపేటలోని తాళ్లపాకలో అన్నమయ్య జన్మించారన్నారు. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మీదుగా తిరుమలకు వెళుతూ శ్రీవారిపై వేలాది సంకీర్తనలు ఆలపించారని గుర్తు చేశారు.
అసలు అన్నమయ్య వెళ్లని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసి దానికి ఆయన పేరు పెట్టడడం ఏమిటని ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చి తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ నియోజకవర్గాన్ని రైల్వేకోడూరులో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.