మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమిపై సీఎం జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఓటమిపై తనదైన శైలిలో వివరించి ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తద్వారా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు. మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలను దక్కించుకున్న టీడీపీ ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే.
గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో వైసీపీ ఓటమి, అలాగే టీడీపీ గెలుపుపై సీఎం జగన్ ఏమన్నారో తెలుసుకుందాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి…. ఒక్కో నియోజకవర్గం 34 నుంచి 39 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారని ఆయన తెలిపారు.
దీన్నిబట్టి ఒక్కో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 80 లక్షల ఓట్లు వుంటాయన్నారు. ఈ పరిధిలో 87 శాతం అంటే.. అక్క చెల్లెమ్మలు, మన కుటుంబాలు ఉన్నాయన్నారు. అలాంటిది కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో చాలా వరకూ డీబీటీలో లేనివారు అన్నారు.
కేవలం 20 శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నారని సీఎం తెలిపారు. ఈ ఫలితాలు ఏ రకంగా ప్రజాతీర్పును ప్రతిబింబిస్తుందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే శాంపిల్ ఇది కాదని జగన్ తేల్చి చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాధాన్య ఓట్లు వుంటాయన్నారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేయగా, మిగిలిన పక్షాలన్నీ కలిసి బరిలో నిలిచాయని ఆయన అన్నారు. అయినప్పటికీ టీడీపీ మొదటి ప్రాధాన్యంలో గెలవలేదని సీఎం చెప్పుకొచ్చారు.
కేవలం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలిచిందని జగన్ తేల్చి చెప్పారు. టీడీపీ గెలుపు కేవలం వాపు మాత్రమే అన్నారు. మీడియాను అడ్డు పెట్టుకుని వాపును బలం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై మొదటి సారి జగన్ మనసులో మాట చెప్పారు. ఈ ఓటమి సాధారణ ఎన్నికలతో ముడిపెట్టడం అవివేకమని ఆయన తేల్చి చెప్పారు.