కరోనా మహమ్మారి మళ్లీ వ్యాపిస్తోంది. తాజాగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కరోనాబారిన పడ్డారు. అందుకే ఆయన ఇవాళ్టి వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇన్చార్జ్ల సమావేశానికి గైర్హాజరయ్యారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళన నెలకుంది. గతంలో కరోనా విజృంభణకు పెద్ద సంఖ్యలో మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు పీడకలలా ఇప్పటికే ప్రతి ఒక్కర్నీ వెంటాడు తున్నాయి.
కనీసం కుటుంబ సభ్యులు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించలేని అమానవీయ పరిస్థితుల్ని కరోనా సృష్టించింది. గతం తాలూకూ చేదు జ్ఞాపకాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి కాపాడుకోడానికి ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తాజాగా మంత్రి కరోనా బారిన పడడంతో ప్రభుత్వం కూడా తన వంతు జాగ్రత్తలు తీసుకోడానికి సన్నద్ధమవుతోంది. మహమ్మారిబారిన పడడం వల్లే సీఎంతో నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని మంత్రి చెప్పారు.