ఢిల్లీలో అప‌రిచితుడు…అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌!

సినిమా షూటింగ్ నిమిత్తం రాజ‌స్థాన్ వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్ర‌నేత‌ల అపాయింట్‌మెంట్ కోసం ప‌వ‌న్ ఎదురు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షాల‌పై వైసీపీ ప్ర‌భుత్వ దాడుల గురించి కేంద్ర…

సినిమా షూటింగ్ నిమిత్తం రాజ‌స్థాన్ వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్ర‌నేత‌ల అపాయింట్‌మెంట్ కోసం ప‌వ‌న్ ఎదురు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షాల‌పై వైసీపీ ప్ర‌భుత్వ దాడుల గురించి కేంద్ర ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్తాన‌ని ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు రోడ్‌మ్యాప్ అంశం తెర‌పైకి వ‌చ్చింది. టీడీపీతో పొత్తు కుదుర్చు కోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల్ని క‌ల‌వాల‌ని అనుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌ళ్లీ బీజేపీ ద‌గ్గ‌రికి ఎందుకు వెళ్లార‌నే చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై ఏపీ బీజేపీ నేత‌లు పెద‌వి విరుస్తున్నాయి. ఆ అప‌రిచితుడు త‌మ అగ్ర‌నేత‌ల్ని క‌ల‌వవ‌డానికి ఎందుకు వెళ్లారో తెలియ‌ద‌ని ఏపీ బీజేపీ నేత‌లు వ్యంగ్యంగా అంటున్నారు. అధికారికంగా త‌మ‌తో పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ, గ‌త గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌ల్లో అడిగినా మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా అవ‌స‌ర‌మైతే ఆయ‌న రాజ‌కీయాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని ఏపీ బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ పెద్ద‌ల నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చాయి. దీంతో ప‌వ‌న్‌ను ఏపీ బీజేపీ నేత‌లు లెక్క‌చేయ‌డం లేదు. సొంతంగా బ‌ల‌ప‌డేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప‌వ‌న్ వ‌ల్ల త‌మ‌కు రాజ‌కీయంగా న‌ష్ట‌మే త‌ప్ప, న‌యా పైసా కూడా లాభం లేద‌ని ఏపీ బీజేపీ నేత‌ల భావ‌న‌. ఈ నేప‌థ్యంలో అమిత్‌షా, న‌డ్డా త‌దిత‌ర బీజేపీ అగ్ర‌నేత‌ల అపాయింట్‌మెంట్ కోసం మ‌నోహ‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్ ఎదురు చూస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారితో క‌లిసిన త‌ర్వాత ప‌వ‌న్ ఏం చెబుతారో చూడాలి.