కన్నబిడ్డల్ని బావిలో పడేసిన తండ్రి

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిండు జీవితాల్ని బలితీసుకున్న ఘటనలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటిదే. భార్యతో గొడవపడి, ఆమెపై కోపంతో ఇద్దరు కన్నబిడ్డల్ని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. విచక్షణ మరిచి ప్రవర్తించి…

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిండు జీవితాల్ని బలితీసుకున్న ఘటనలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటిదే. భార్యతో గొడవపడి, ఆమెపై కోపంతో ఇద్దరు కన్నబిడ్డల్ని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. విచక్షణ మరిచి ప్రవర్తించి చదువుకున్న మూర్ఖుడు అనిపించుకున్నాడు. తన చేతులతో ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు. తెలంగాణలోని మహబూబాబాద్ లో జరిగింది ఈ దారుణం.

మెహబూబాబాద్ లోని గడ్డిగూడెం తండాలో చోటుచేసుకున్న విషాధం ఇది. తండాకు చెందిన రామ్ కుమార్, శిరీషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 8 ఏళ్ల వీళ్ల ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలున్నారు. పెద్దమ్మాయి అమ్మి వయసు ఆరేళ్లు కాగా.. కొడుకు జానీ వయసు మూడేళ్లు. రామ్ కుమార్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ముంబయిలో పనిచేస్తున్నాడు.

సంక్రాంతి పండగ కోసం ముంబయి నుంచి తండాకు వచ్చాడు రామ్ కుమార్. వచ్చిన 2 రోజులకే భార్యభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్యపై చేయిచేసుకున్నాడు రామ్ కుమార్. దీంతో ఆగ్రహించిన భార్య, పిల్లల్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో రామ్ కుమార్ విచక్షణ కోల్పోయాడు. ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. పిల్లల్ని చంపి భార్యపై కసి తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఊరు చివర్లో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పిల్లల్ని ఆ బావిలో పడేశాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారులిద్దరూ బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

పిల్లలు చనిపోయిన తర్వాత రామ్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతారం రైల్వే ట్రాక్ పైకి వెళ్లి, ట్రయిన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు.