మచిలీపట్నం వేదికగా జనసేన పదో ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఈ వేదికపై నుంచి ఎప్పట్లాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తన మార్క్ విమర్శలను గుప్పించారు. పవన్ ప్రసంగంలో ఒక ప్రత్యేకత వుంది.
అదేంటంటే… ఎల్లో పత్రికాధిపతికి చెప్పుదెబ్బలు తప్పవని పవన్ హెచ్చరించడం గమనార్హం. ఇంతకూ పవన్తో అంత మాట అనిపించుకున్న పత్రికాధిపతి& జర్నలిస్టు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాళ ఆ చెప్పు దెబ్బల అంశాన్ని కనీసం ఆ పత్రిక ప్రచురించలేదు.
అసలు పవన్కల్యాణ్కు కోపం తెప్పించిన ఆ రాతలేంటో తెలుసుకుందాం. రెండు వారాల క్రితం పచ్చ మీడియాధిపతి తన వీకెండ్ కామెంట్లో ఏం రాశారంటే… “వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఫర్వాలేదు. నేను సమకూరుస్తాను. మీరు నాతో చేతులు కలపండి అంటూ పవన్కు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు” అని సదరు జర్నలిస్టు, మీడియాధిపతి రాశారు. ఈ రాతలే పవన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మచిలీపట్నం సభలో పవన్ రియాక్షన్ ఏంటంటే…
“వెయ్యి కోట్లపై మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి నాకు రూ.1000 కోట్ల ఆఫర్ చేశారంట. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. గతంలోనూ ఇలాగే ప్యాకేజీ ఇచ్చారంటే చెప్పు చూపాను. తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు చేసిన చెప్పుల్నే నేను వేసుకుంటా. పిచ్చిపిచ్చిగా వాగితే వాటితో కొడితే గట్టి దెబ్బ పడుతుంది” అని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
వెయ్యి ఆఫర్ రాతలపై ఆ తర్వాత ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అర్థం చేసుకోవాలే తప్ప అపార్థం చేసుకోవద్దని వేడుకున్నారు. తనను తప్పు పట్టిన నాగబాబును కూడా కించపరిచేలా ఆ మీడియాధిపతి రాసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో చెప్పు దెబ్బల కామెంట్స్ సదరు పత్రికలో ఇవాళ కనిపించకపోవడం గమనార్హం.
పవన్ చెప్పు దెబ్బల వార్నింగ్… ఆ పత్రికాధిపతిని బాగా హర్ట్ చేసినట్టే కనిపిస్తోంది. ఇదే మాట మరెవరినైనా పవన్ అని వుంటే… ఆ పత్రికలో పతాక శీర్షికన ప్రచురించే వాళ్లు. కానీ తనను ఉద్దేశించి ఘాటు హెచ్చరిక చేయడంతో కనీసం ప్రచురణకు నోచు కోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.