ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత విచారణకు ఒక్క రోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాక్. ఇది అనూహ్య పరిణామంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ పేరుతో కవితను ఢిల్లీకి పిలిపించుకుని … అరెస్ట్ చేయడమే తరువాయి అన్నట్టుగా బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్తో కవిత నేతృత్వంలో దీక్ష జరుగుతుండగా, మరోవైపు ఈడీకి షాక్ తగిలింది.
లిక్కర్ స్కామ్లో ఇటీవల అరెస్ట్ అయిన వ్యాపారవేత్త, కవితకు బాగా కావాల్సిన వ్యక్తిగా పేరున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీకి వచ్చిన వాంగ్మూలంపై యూటర్న్ తీసుకున్నారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోడానికి అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం ఆయన పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం ఈడీకి నోటీసులు కూడా పంపడం గమనార్హం.
కవిత బినామీగా తాను వ్యవహరించానని అరుణ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు విచారణకు ఆమె హాజరు కావాల్సి వుంది. ఈడీకి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, మళ్లీ వెనక్కి తీసుకోవడంపై సాధ్యాసాధ్యాల గురించి పూర్తిగా తెలియాల్సి వుంది. కానీ న్యాయస్థానం అరుణ్ రామచంద్ర పిళ్లై పిటిషన్ను పరిగణలోకి తీసుకోవడం, దానిపై ఈడీకి నోటీసులు ఇవ్వడం చకాచకా జరిగిపోయాయి.
అరుణ్ తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోడానికి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, దాని ఆధారంగా తనకు నోటీసులు ఇవ్వడంపై కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం వుందనే ప్రచారానికి తెరలేపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేంద్రప్రభుత్వం, తెలంగాణ అధికార పార్టీ పరస్పరం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరికొత్త గేమ్కు శ్రీకారం చుట్టాయి. ఈ ఆట మున్ముందు ఎన్నెన్ని మలుపులు తిరగనుందో చూడాలి.