ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో ఆంక్షలను మొదలుపెట్టింది కర్ణాటక. దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కరోనా కేసుల సంఖ్య రెండంకెల స్థాయిలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలను చేపట్టారు. ఈ మేరకు నైట్ కర్ఫ్యూను ప్రకటించింది బొమ్మై ప్రభుత్వం.
రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము ఐదు వరకూ నైట్ కర్ఫ్యూ అని నిర్ణయించారు. ముందుగా రానున్న పది రోజుల పాటు ఈ మేరకు కర్ఫ్యూను అనౌన్స్ చేశారు. ఇదే సమయంలో మాల్స్, పబ్బులు, బార్లు, థియేటర్ల విషయంలో కూడా ఆంక్షలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వీటిని యాభై శాతం కెపాసిటీ మేరకే నిర్వహించాలని స్పష్టం చేశారు.
థియేటర్ల కెపాసిటీని యాభై శాతానికి కుదించుకోవాలని ఆదేశించారు. అలాగే బార్లూ, పబ్బులపై కూడా ఈ మేరకు ఆంక్షలు పెట్టారు. ఇలా కర్ణాటకలో మళ్లీ కరోనా లాక్ డౌన్ తరహా పరిస్థితులు పాక్షికంగా వస్తున్నట్టున్నాయి.
ఇక అంతా మామూలు స్థితికి వచ్చిందనుకున్న పరిస్థితుల్లో.. కథ రివర్స్ కావడం గమనార్హం. న్యూ ఇయర్ వేడుకలకు బెంగళూరు పెట్టింది పేరుగా నిలిచింది. అయితే గత ఏడాది చాలా ఆంక్షల మధ్యన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి తలెత్తినట్టుగా ఉంది!