ప్రోబ్లమ్ వచ్చినపుడు హీరోలు అందరూ ఒక్కటవ్వాల్సిన అవసరం వుందని హీరో నాని అభిప్రాయపడ్డారు. శ్యామ్ సింగ రాయ్ విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా ఆయన గ్రేట్ ఆంధ్రతో మాట్లాడారు.
ఈ సందర్భంగా టికెట్ ల అంశంపై ఆయన చేసిన కామెంట్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలు మరో సారి షేర్ చేసుకున్నారు.
తాను అన్నది గోరంత అని, దాన్ని చీల్చి, చీల్చి ఏదేదో చేసి, దాని గురించి ఎవరినో అడిగి, వారేదో అంటే దాంతో మరింత హడావుడి చేసారనే విధంగా ఆయన సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ప్రోబ్లమ్ రియల్ అని, కానీ ప్రోబ్లెమ్ వచ్చినపుడు అందరూ ఒక్కటికావాల్సిన అవసరం వుందని అన్నారు. కానీ అలాంటి పరిస్థితి టాలీవుడ్ లో లేదని అన్నారు.
తన మాటలు తప్పయితే తనకు ఆనందమే అని కూడా ఆయన అన్నారు. ఎవరినీ అవమానించడం తన అభిమతం కాదని, తన తండ్రికి చిన్న కెఫే స్టోర్ వుండేదని, అందువల్ల చిన్న దుకాణాల గురించి తనకే బాగా తెలుసు అని ఆయన అన్నారు.
బిగినింగ్ లో ఈ సమస్య ప్రారంభమయినపుడల్లే అందరూ ఒక తాటిపైకి వచ్చి సమస్యను డీల్ చేసి వుంటే ఇలా జరిగివుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోల్లో ఐక్యత లేదు అన్న తన అభిప్రాయం తప్పయితే తనకు ఆనందమే అన్నారు.