స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డీప్ ట్రబుల్స్ లో ఉన్నట్టుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి గత నాలుగేళ్లలో ఏ కోర్టులోనూ ఇబ్బంది కలగలేదు. కోర్టు తలుపులు తట్టి ఏపీలో పాలననే స్తంభింపజేయగలిగారు తెలుగుదేశం వాళ్లు! బహుశా.. ఈ అంశం అంటూ వదలకుండా అన్నింటి విషయంలోనూ కోర్టు మెట్లెక్కారు! అలాంటి కేసుల సంఖ్య వందల్లో ఉంటుంది!
అన్నింట గెలిచినా.. వరసగా రెండు పిటిషన్ల విషయంలో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు చంద్రబాబును జ్యూడీషియల్ రిమాండ్ కే ఇవ్వదని చాలా మంది అనుకున్నారు! ఇప్పుడు హౌస్ అరెస్టు కోరినా.. ప్రయోజనం దక్కలేదు. మరి హైకోర్టులో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఈ కేసులో చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సీఐడీ వాదనకు బలమైన ఆధారాలున్నాయి. అందులో ముఖ్యమైనది ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులు ఇటీవలే విదేశాలకు పరారీ కావడం!
వారి పరారీనే చంద్రబాబును జైల్లో ఉంచడానికి సీఐడీకి పదునైన ఆయుధంగా మారింది. ఈ స్కామ్ లో చంద్రబాబుపై మోపిన 409 సెక్షన్ కూడా చాలా పదునైనదని, గట్టి ఆధారాల్లేకుంటే విచారణ సంస్థలు ఆ సెక్షన్ జోలికి వెళ్లవని న్యాయనిపుణులు అంటున్నారు. ఆ సెక్షన్ చంద్రబాబు పై పెట్టడానికి వీల్లేదంటూ తొలి రోజే ఆయన న్యాయవాదులు వాదించడం గమనార్హం.
అయితే సీఐడీ మాత్రం పక్కా ఆధారాలతో ఆ సెక్షన్ ను ఉపయోగించినట్టుగా ఉంది. చంద్రబాబు అరెస్టుకు రెండు మూడు రోజుల ముందు ఇద్దరు నిందితులు అమెరికా పారిపోవడం వెనుక కూడా చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ వాదించే అవకాశం ఉంది. చంద్రబాబు బయట ఉంటే.. ఈ తరహాలో కేసు ధర్యాప్తుకు ఆటంకాలను సృష్టించగలరనే వాదనా వినిపించవచ్చు.
సాక్షులను ప్రభావితం చేయడం కాదు, ఏకంగా నిందితులు దేశం దాటిపోవడం మరింత తీవ్రమైన విషయం. ఇలాంటి వారికి టీడీపీ ఎన్నారైలు ఆశ్రయం ఇస్తుంటారు కాబోలు. సరిగ్గా చంద్రబాబు అరెస్టుకు రెండు మూడు రోజుల కిందట జరిగిన పరారీలు .. చంద్రబాబు బెయిల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి!