కొత్త జంట మంచు మనోజ్, భూమా మౌనిక ఇవాళ హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ వరకూ బలప్రదర్శన చేశారు. పెళ్లయిన తర్వాత అత్తగారింటికి మంచు మనోజ్ మందీమార్బలంతో బయల్దేరారు. 15 వాహనాలతో కూడిన కాన్వాయ్ కుయ్ కుయ్మంటూ ఆళ్లగడ్డకు పరుగు తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కచెల్లెళ్లు అఖిలప్రియ, మౌనిక మధ్య విభేదాలున్నప్పటికీ, వివాహ శుభవేళలో ఇద్దరూ కలుసుకోవడం విశేషం.
వీళ్లిద్దరి మధ్య పెద్దమ్మ (శోభానాగిరెడ్డి అక్క) రాజీ కుదిర్చినట్టు సమాచారం. ఏది ఏమైనా మౌనిక పెళ్లికి అఖిలప్రియ, ఆమె తమ్ముడు జగత్, భర్త భార్గవ్రామ్ హాజరయ్యారు. పెళ్లిలో సందడి చేశారు. మౌనిక , మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మీప్రసన్న అంగరంగ వైభవంగా జరిపించిన సంగతి తెలిసింది. భూమా కుటుంబ స్థాయికి తగ్గట్టు ఇవాళ ఆళ్లగడ్డలో అఖిలప్రియ రిసెప్షన్ చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంచు మనోజ్, మౌనిక దంపతులు హైదరాబాద్లో ఇంటి నుంచి బయల్దేరిన మొదలు మీడియాలో విస్తృత ప్రచారం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదంతా మనోజ్, మౌనిక దంపతులు ఓ పథకం ప్రకారం చేపట్టినట్టు సమాచారం. మౌనికకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువ. రానున్న రోజుల్లో రాజకీయంగా మౌనిక దంపతులు ఎలా వ్యవహరిస్తారనే దానికి ఇది ట్రైలర్ అని కర్నూలు జిల్లాలో చర్చ నడుస్తోంది. మౌనికకు చక్కటి వాక్చాతుర్యం ఉన్న సంగతి విదితమే. రాజకీయంగా, సామాజికంగా ఆమెకు మంచి అవగాహన ఉంది. తనను ప్రోత్సహించే భర్త మనోజ్ తోడవడంతో ఇక ఆమె వెనుదిరిగి చూసే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో తమ స్థాయి ఏంటో తెలియజేయడానికే భారీ కాన్వాయ్తో రావడం, దాన్ని చిత్రీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఆ వీడియోలను మీడియాలో వచ్చేలా చూసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం లేదనుకుంటే పొరపాటే. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ కుటుంబ పేరును రాజకీయంగా ఏ విధంగా వినియోగించుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్న.