ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మాట్లాడారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు విషయంలో తమ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోదని సృష్టం చేశారు. ఆయన అరెస్టు ఏపీకి సంబంధించిన సమస్య అని.. రెండు రాజకీయ పార్టీల తగాదాగా అభివర్ణించారు.
చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంశం అని.. ఆయన అరెస్టయితే తెలంగాణలో ధర్నాలు, ర్యాలీలేంటీ? అంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరియర్ పాడు చేసుకోవద్దని హితవు చెప్పారు. హైదారాబాద్లో ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వాలని లోకేష్ అడిగారని.. తమకు రాజకీయాల కంటే శాంతిభద్రతలే ముఖ్యమని.. తెలంగాణలో ర్యాలీలు వద్దు.. ఆంధ్రలో చేసుకోమని హితవు చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు తనకు స్నేహితులేనన్నారు.
అలాగే నామినేటెడ్ ఎమ్మెల్సీలకు తిరస్కరణకు గురైన దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల గురించి మాట్లాడుతూ ఒకరు ప్రొఫెసర్, మంచి వ్యక్తి అని వారిని తెలంగాణ గవర్నర్ ఆమోదిస్తారని అనుకున్నాం అని కాకపోతే ప్రధాని మోదీ ఎజెండాగా గవర్నర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ అయ్యే ఒక్కరోజు ముందు కూడా తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేశారని.. అలాంటి ఆమెను గవర్నర్గా నియమించడం సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధమన్నారు. గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా..? గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అంటూ విమర్శించారు.