టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. జగన్ తండ్రి దివంగత వైఎస్సార్పై ఆయన ప్రేమాభిమానాలు కనబరుస్తున్నారు. ఇటీవల కాపులకు కొద్దోగొప్పో వైఎస్సార్ మేలు చేశారన్నారు. వైఎస్సార్ కేబినెట్లో కన్నా మంత్రిగా పని చేశారు. తనను ప్రోత్సహించిన వైఎస్సార్కు కృతజ్ఞత చాటుకోవడంలో కన్నా ఏ మాత్రం వెనుకాడకపోవడం గమనార్హం.
ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్ పేరును చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. తండ్రి కంటే మంచి పాలన అందిస్తానని చెప్పిన జగన్, ఆచరణలో మాత్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తన కొత్త బాస్ చంద్రబాబుపై వైసీపీ అసభ్యకర భాష వాడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని మరోసారి కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల సొమ్మును వారికే పంచుతూ తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, సంక్షేమ పథకాల పేరుతో వాలంటీర్ల ద్వారా ఓట్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
ఒకవైపు చంద్రబాబు మాత్రం వైఎస్సార్ పాలనను కూడా విమర్శిస్తున్నారు. జగన్తో పోల్చితే మాత్రం వైఎస్సార్ చాలా మేలని చంద్రబాబు అంటున్నారు. వైఎస్సార్ ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదని బాబు అంటున్నారు. ఒకవైపు వైఎస్సార్ను పొగుడుతూ, మరోవైపు ఆయన తనయుడు జగన్ను విమర్శించడం వెనుక వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ బలం అంతా ఆయన తండ్రి వైఎస్సారే అని, ఆయన ఆభిమానుల్ని తమ వైపు తిప్పుకుంటే … ముఖ్యమంత్రిని బలహీనపరచొచ్చనే వ్యూహంతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పొచ్చు.