ఏపీ నుంచి గణనీయంగా పెరిగిన ఎగుమతులు

ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2016-17లో ఆంధ్రప్రదేశ్‌…

ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2016-17లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 11,939 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా 2020-21 నాటికి ఎగుమతుల విలువ 16,842 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. 

ఎగుమతుల్లో ఆక్వా ఉత్పత్తులు, డ్రగ్స్, ఫార్మా, కెమికల్స్ ఉత్పాదనలు, పండ్లు, కూరగాయలు ప్రధాన భూమిక పోషించినట్లు ఆమె తెలిపారు. దేశం మొత్తం మీద ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే అతి పెద్ద వాటా అని చెప్పారు.

ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు సైతం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆక్వా ఎగుమతులను రెట్టింపు చేయడానికి తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. చైనా, విజయత్నాం, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, దక్షిణ కొరియా దేశాలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆక్వా ఉత్పాదనల ఎగుమతులను మరింతగా పెంచేందుకు ఎంపెడా, వాణిజ్య విభాగం ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల ద్వారా ఆయా దేశాల మార్కెట్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టింది. 

వర్చువల్‌ విధానంలో విక్రేతలు, కొనుగోలుదార్లతో సమావేశాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. కోల్డ్‌ స్టోరేజ్‌లో నిలువ చేసిన చేపలు, రొయ్యలతోపాటు ఎండబెట్టిన చేపలను కూడా ఎగుమతి చేయడానికి అవసరమైన అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. రోగరహతింగా, సురక్షిత ఆక్వా సాగు చేసే విధంగా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 

చేప, రొయ్య పిల్లల పెంపకానికి రైతులకు ఆర్థిక సహాయం కూడా అందింస్తున్నట్లు తెలిపారు. రైతు సొసైటీల ద్వారా ఎగుమతులకు గిరాకీ ఉన్న ఆక్వా ఉత్పాదనల మార్కెటింగ్‌ కోసం ఈ-సంత పేరిట ఈ కామర్స్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ-సంత ద్వారా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే ఎగుమతిదార్లకు తమ ఆక్వా ఉత్పాదనలను విక్రయించుకునే సదుపాయం కలిగిందని తెలిపారు.