తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టులో సానుభూతి వెల్లువెత్తుతోందని పచ్చవర్గాలు ఒకవైపు చెబుతున్నాయి. మరోవైపేమో చంద్రబాబు బెయిల్ ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి! ఒకవేళ సానుభూతి రావడం జరుగుతూ ఉంటే.. చంద్రబాబు కోసం బెయిల్ ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నట్టు? అనేది ధర్మసందేహం!
చంద్రబాబు అరెస్టుతో విపరీతమైన సానుభూతి వచ్చేట్టుగా అయితే ఎన్నికల వరకూ ఆయన జైల్లోనే ఉంటేనే టీడీపీకి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే.. ఎలాగూ చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పగ్గాలను లోకేష్ చేపట్టినట్టే కదా! పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు మనిషినని ప్రకటించేసుకున్నాడు. మరి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరు తోడయ్యాకా.. చంద్రబాబు రానున్న ఆరు నెలలూ జైల్లో కూర్చుంటేనే సానుభూతి పెల్లుబుక వచ్చు!
అభ్యర్థుల విషయంలో లోకేష్ కు గైడెన్స్ ఇవ్వడానికి రెండు మీడియా వర్గాల సేవలు ఎలాగూ ఉన్నాయి. రెండు పత్రికలు, నాలుగు చానళ్లు లోకేష్ కు ఈ విషయంలో చాలా చేదోడువాదోడుగా ఉండవచ్చు. జైలు నుంచి కూడా చంద్రబాబు మంత్రాంగమూ నడిపించవచ్చు. ఎలాగూ వారంలో మూడు రోజుల పాటు ములాఖత్ అవకాశం ఉండనే ఉంది.
ఆ సమయంలో లోకేష్, పవన్ కల్యాణ్ లు వెళ్లి చంద్రబాబు మార్గదర్శకత్వం పొందవచ్చు. ఇంకా హైదరాబాద్ లో రాజగురువు ఉన్నాడు, ఇంకో ఓపెన్ హార్ట్ సర్జన్ ఉన్నారు. వీరూ అన్ని రకాలుగానూ సహకరిస్తారు.
మరి చంద్రబాబు జైలు పాలైనా.. టీడీపీ వ్యవహారాలన్నీ వీరు నడిపించేయగలరు కదా! మరి చంద్రబాబును అరెస్టు చేసినందుకు సానుభూతి అదనం అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా పొత్తు ప్రకటన చేసేశాడు. కాబట్టి.. టీడీపీకి అన్నీ సమకూరినట్టే. ఎంచక్కా చంద్రబాబు జైల్లో కూర్చోవచ్చు. బెయిల్ పిటిషన్లను ఆపేసి.. ఈ కేసులన్నీ ఎదుర్కొనే జైలు నుంచి బయటకు అంటూ.. ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన చేసేసి.. తను జైల్లో కూర్చుని వ్యవహారం నడిపించుకోవచ్చు!
ఎలాగూ మందులు, ఇంటి భోజనానికీ ఇబ్బంది లేదు! జైల్లో చంద్రబాబు నాయుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారట! అక్కడ కూడా రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారట! మరి ఇంత బాగునప్పుడు.. చంద్రబాబు జైల్లో కూర్చోవడమే ఆయనకు, ఆయన పార్టీకి మేలు చేసేదిలా ఉంది. దత్తపుత్రుడు, సొంత పుత్రుడు పార్టీ బాధ్యతలు తీసుకుంటే.. చంద్రబాబు జైల్లో ఉండి సానుభూతి తెచ్చి పెడుతూ ఉంటారు. అది టీడీపీకి చాలా మేలు చేస్తుందంటున్నారు కాబట్టి.. బెయిల్ పిటిషన్లను, ఇతర పిటిషన్లను కట్టిపెట్టి. జైల్లో కూర్చుని తేల్చుకుంటానంటూ చంద్రబాబు ప్రకటించేయొచ్చుగా!