మాయాబ‌జార్‌లో రేలంగి …రాజ‌కీయాల్లో ఆయ‌న!

టీడీపీ యువ‌సార‌థి నారా లోకేశ్ పాద‌యాత్ర అంటే అధికార పార్టీకి చుల‌క‌న అయ్యింది. లోకేశ్‌ను లీడ‌ర్‌గా చూడ‌డం మానేశారు. లోకేశ్ అంటే ఓ క‌మెడియ‌న్‌గా చూస్తూ, ఆయ‌న్ను అవ‌హేళ‌న చేస్తున్నారు. ఇందుకు లోకేశ్ కూడా…

టీడీపీ యువ‌సార‌థి నారా లోకేశ్ పాద‌యాత్ర అంటే అధికార పార్టీకి చుల‌క‌న అయ్యింది. లోకేశ్‌ను లీడ‌ర్‌గా చూడ‌డం మానేశారు. లోకేశ్ అంటే ఓ క‌మెడియ‌న్‌గా చూస్తూ, ఆయ‌న్ను అవ‌హేళ‌న చేస్తున్నారు. ఇందుకు లోకేశ్ కూడా త‌న వంతుగా త‌ప్పుల్లో కాలు వేస్తూ… ప్ర‌త్య‌ర్థుల‌కు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. లోకేశ్‌ను వైసీపీకి చెందిన చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ విమ‌ర్శిస్తూ…. సంబ‌రాలు చేసుకుంటున్నారు.

తాజాగా లోకేశ్‌ను ఓ క‌మెడియ‌న్ అన‌డంతో పాటు ఫ‌లానా సినిమాలోని పాత్ర‌కు స‌రితూగుతార‌నే వ్యంగ్య కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి నాగార్జున మాట్లాడుతూ లోకేశ్ పాద‌యాత్ర కామెడీ సినిమాను త‌ల‌పిస్తోంద‌ని విమ‌ర్శించారు. త‌న స్థాయికి మించి సీఎం జ‌గ‌న్‌పై లోకేశ్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు.

క‌మెడియ‌న్ పాత్ర‌కు మాత్ర‌మే లోకేశ్ న్యాయం చేస్తార‌ని ఆయ‌న వెట‌క‌రించారు. రాష్ట్రానికి గొప్ప క‌మెడియ‌న్ దొరికాడ‌ని నాగార్జున యాద‌వ్ సెటైర్ విసిరారు. మాయాబ‌జార్ సినిమాలో రేలంగి పాత్ర ఎలాంటిదో ఏపీ రాజ‌కీయాల్లో లోకేశ్ పాత్ర కూడా అలాంటిదే అని ఆయ‌న దెప్పి పొడిచారు. అజ్ఞానానికి ట‌క్కు టై వేస్తే అదే లోకేశ్ అని ఆయ‌న వెట‌క‌రించారు. నారా లోకేశ్‌వ‌న్నీ ఉడ‌త ఊపులే అని ఆయ‌న విమ‌ర్శించారు.  

రాజ‌కీయాల్లో కేఏ పాల్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లోకేశ్‌ల‌ను ఒకే గాట క‌ట్టేయ‌డం గ‌మ‌నార్హం. ప‌దేప‌దే వీరిని క‌మెడియ‌న్ల‌తో పోల్చ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో వారిపై నాన్ సీరియ‌స్ రాజ‌కీయ నేత‌లనే ముద్ర వేయ‌డంలో వైసీపీ స‌క్సెస్ అయ్యింది. వైసీపీ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని నిరూపించుకోడానికి లోకేశ్‌కు పాద‌యాత్ర కంటే మంచి అవ‌కాశం దొర‌క‌దు. కానీ దాన్ని ఆయ‌న స‌ద్వినియోగం చేసుకుంటున్న దాఖ‌లాలు లేవు.