తెలిసి తెలిసి ఎవరూ కూడా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జోలికెళ్లరు. అయితే నేరుగా తననెవరూ అనకపోయినా , తాను నెత్తికెత్తుకున్న అంశాలపై విమర్శలు చేస్తే మాత్రం కంగనా ఊరుకోరు. తాజాగా కంగనా ట్వీట్ ….సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్కు మైండ్బ్లాక్ అయ్యేలా ఉంది. జయాబచ్చన్పై కంగనా వివాదాస్పద ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.
బాలీవుడ్ పరిణామాలు పార్లమెంట్ను కూడా తాకాయి. బాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై పార్లమెంట్లో సభ్యులు ప్రస్తావించారు. లోక్సభలో నిన్న బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీనటులు డ్రగ్స్కు బానిసయ్యారని విమర్శించారు. యువతను డ్రగ్స్కు బానిస చేస్తున్న కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని …పక్క దేశాల నుంచి డ్రగ్స్ రాకుండా అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయాబచ్చన్ రాజ్యసభలో మంగళవారం మాట్లాడారు. డ్రగ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని , సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కూడా బాలీవుడ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
నటులంతా డ్రగ్స్ వాడుతూ చిత్ర పరిశ్రమను మురికి కూపంగా మార్చారంటూ కామెంట్లు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఓ ఎంపీ నిన్న లోక్సభలో చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటన్నారు. సినిమాల్లో నటించే వాళ్లు కూడా బాలీవుడ్ను మురికి కూపమని అవమానపరుస్తున్నారన్నారు. చిత్ర పరిశ్రమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు.
రాజ్యసభలో జయాబచ్చన్ ప్రసంగంపై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారని ఇటీవల కంగనా బాంబులాంటి మాటలు పేల్చిన విషయం తెలిసిందే. దీంతో జయాబచ్చన్ మాటలు కంగానకు కోపం తెప్పించాయి. జయాబచ్చన్పై తీవ్ర పదజాలంతో కంగనా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జయాబచ్చన్పై కంగనా వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడిన తీరు సరైంది కాదు. నా మాదిరిగా మీ కుమార్తె శ్వేతా బచ్చన్ కుడా టీనేజ్లో వేధింపులు గురైతే ఇట్లే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడికి గురై సుశాంత్ సింగ్ రాజ్పుత్లా మీ కుమారుడు అభిషేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇట్లే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి” అని కంగనా మండిపడ్డారు.