బిగ్బాస్ సీజన్ -1 విజేత, సినీ నటుడు శివబాలాజీ న్యాయం కోసం హైదరాబాద్లోని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై హెచ్ఆర్సీకి ఆయన ఫిర్యాదు చేశారు. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందంటే…
హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ పాఠశాలలో శివబాలాజీ పిల్లలు చదువుతున్నారు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలు ఆన్లైన్లో పిల్లలకు పాఠాలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు స్కూల్కు నేరుగా వెళ్లకపోవడంతో , తన పిల్లల ఫీజులు తగ్గించాలని పాఠశాల యాజమాన్యాన్ని శివబాలాజీ కోరారు.
దీంతో పాఠశాల యాజమాన్యానికి కోపం వచ్చింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శివబాలాజీ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తప్పించారు. దీంతో షాక్కు గురైన శివబాలాజీ న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. పాఠశాల యాజమాన్యం ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు.
పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్లైన్ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలాగే చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నట్టు ఫిర్యాదులో పొందుపరిచారు. పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని హెచ్ఆర్సీని శివబాలాజీ కోరారు. దీనిపై హెచ్ఆర్సీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.