ఢిల్లీ అల్లర్ల కేసు విద్యార్థులు, రాజకీయ నాయకులకే కాదు ….సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా చుట్టుకునేలా ఉంది. ఈ కేసు విచారణకు రావాలని ఇద్దరు నిర్మాతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు పంపారు. నేడు వారిని విచారించ నున్నారు.
గత ఏడాది డిసెంబర్లో కేంద్రప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఢిల్లీలో హింసకు దారి తీసింది. ఈ అల్లర్లలో 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే వందలాది మంది గాయాలపాలయ్యారు.
ఈ చట్టాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు ఢిల్లీలో చెలరేగిన హింసకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు 250కి పైగా చార్జిషీట్లు దాఖలు చేశారు. 1,153 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.
అలాగే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతీ ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వనంద పేర్లు ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
ఇదే కేసులో డాక్యుమెంటరీ నిర్మాతలు రాహుల్రాయ్, సబా దేవన్ మంగళవారం విచారణకు రావాలని ఒకరోజు ముందు వారికి సమన్లు జారీ చేయడం గమనార్హం. మున్ముందు ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోననే ఆందోళన నెలకొంది.