ఏపీ సీపీఐకి చెందిన కొందరు నాయకులు బట్టలిప్పుకుని సిగ్గు లేకుండా తిరుగుతున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబునాయుడికి మద్దతు పలికి తాము ఆయన చంకలో నేతలనే విమర్శలకు బలం చేకూర్చారు. చంద్రబాబునాయుడిని సీఐడీ అరెస్ట్ చేయగా, ఏపీ సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ జీర్ణించుకోలేక పోతున్నారు. సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు.
ఈ ఇద్దరు నాయకుల తీరును సొంత పార్టీ నాయకులే అసహ్యించుకుంటున్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతోనే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేస్తే, ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి, విమర్శించడం ఎందుకో సీపీఐ నాయకులు సమాధానం చెప్పాలి.
పోనీ చంద్రబాబునాయుడేమైనా సీపీఐతో ఉన్నారా? అంటే … అదీ లేవు. ఇప్పటికీ బీజేపీపై చంద్రబాబు ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. సిద్ధాంతపరంగా కూడా చంద్రబాబుతో ఏకీభావం లేని సీపీఐ నాయకుడు నారాయణ, రామకృష్ణ ఏ ప్రాతిపదికన అరెస్ట్ను ఖండిస్తున్నారనే ప్రశ్న వస్తోంది. బీజేపీ అవకాశం ఇస్తే అంటకాగడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్న సంగతి సీపీఐ నాయకులైన వాళ్లద్దరికీ తెలియడం లేదా?
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తుండడం వల్ల సీపీఐని కమ్మనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ విమర్శల్ని కాసేపు పక్కన పెడితే, నారాయణ, రామకృష్ణ చేస్తున్నది కూడా అదే కదా! చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గతంలో వైఎస్ జగన్ను సీబీఐ అరెస్ట్ చేసినప్పుడు, అలాగే 16 నెలలు జైల్లో వేసినప్పుడు సీపీఐ ఇదే రీతిలో వ్యవహరించిందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. వీళ్లద్దరికీ అసలు సిగ్గు, మానం అనేవి ఏమైనా ఉన్నాయా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేశ్కు రామకృష్ణ ఫోన్ చేసి సీఐడీ పోలీసుల తీరు దుర్మార్గమని విమర్శించారు. అలాగే ధైర్యం వీడకుండా మనో ధైర్యంతో ఉండాలని లోకేశ్ను రామకృష్ణ కోరడం గమనార్హం. ఒక సిద్ధాంతం కోసం పని చేసే సీపీఐ, దాన్ని వదిలేసి జగన్ వ్యతిరేకత, చంద్రబాబు పల్లకీమోత అనే ఏకైక సిద్ధాంతంతో నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నట్టు విమర్శ వినిపిస్తోంది.