ఆధునిక రాజ‌కీయాల్లో ‘ఉత్త‌’కుమారుడు

అన్నీ మ‌నం అనుకున్న‌ట్టే జ‌రగ‌వు. అదే నిజ‌మైతే పండిత పుత్ర, ప‌ర‌మ‌శుంఠ అనే మాట పుట్ట‌దు. చంద్ర‌బాబు పండితుడు కాక‌పోయినా, లోకేశ్ మాత్రం ప‌ర‌మ‌శుంఠే. చంద్ర‌బాబు తాను తెలివైన వాడిన‌ని అనుకున్నాడే త‌ప్ప‌, కొడుకుకి…

అన్నీ మ‌నం అనుకున్న‌ట్టే జ‌రగ‌వు. అదే నిజ‌మైతే పండిత పుత్ర, ప‌ర‌మ‌శుంఠ అనే మాట పుట్ట‌దు. చంద్ర‌బాబు పండితుడు కాక‌పోయినా, లోకేశ్ మాత్రం ప‌ర‌మ‌శుంఠే. చంద్ర‌బాబు తాను తెలివైన వాడిన‌ని అనుకున్నాడే త‌ప్ప‌, కొడుకుకి తెలివి తేట‌లు అబ్బేలా పెంచ‌లేక‌పోయాడు.

చివ‌రికి లోకేశ్ స్థితి ఏమంటే అత‌నికి జ‌న‌మూ తెలియ‌దు, రాజ‌కీయ‌మూ తెలీదు. 2014లో గెలిచిన త‌ర్వాత బాబులో ఆత్మ‌విశ్వాసం పెరిగింది. ఇక జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని అనుకున్నాడు. పార్టీకి వార‌సుడు రావ‌ల్సిన టైమ్ ఆస‌న్న‌మైంద‌ని లోకేశ్‌ను తెచ్చాడు. బాబుకి లోకేశ్ మీద నిజంగా న‌మ్మ‌క‌మే వుంటే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చి 2014లోనే గెలిపించుకునేవాడు. లేదు కాబ‌ట్టే ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి ఇచ్చాడు.

బాబు కొడుకు అనే ఒకే ఒక అర్హ‌త త‌ప్ప‌, మంత్రి కావ‌డానికి లోకేశ్‌కి ఏ అర్హ‌తా లేదు. ఇదే ప్ర‌శ్న జ‌గ‌న్‌కి కూడా వేయొచ్చు. వైఎస్ కుమారుడు కాకుండా ఆయ‌న అర్హ‌త ఏంట‌ని? నిజ‌మే వైఎస్ కుమారుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా, వైఎస్ అనంత‌రం పెద్ద యుద్ద‌మే చేసి త‌న‌ని నిరూపించుకున్నాడు.

అయితే లోకేశ్ త‌న‌ని ప్రూవ్ చేసుకోడానికి వ‌చ్చిన అవ‌కాశాన్ని పిరికిత‌నంతో వ‌దులుకున్నాడు. తండ్రి జైల్లో వున్న‌ప్పుడు పార్టీ మీద త‌న ముద్ర‌ని చూపించే అవ‌కాశం లోకేశ్‌కి వ‌చ్చింది. చంద్ర‌బాబుని అన్యాయంగా అరెస్ట్ చేశార‌ని నిర‌సిస్తూ లోకేశ్ పార్టీని న‌డిపించి వుంటే ఆయ‌న ఇమేజ్ ఇంకో ర‌కంగా వుండేది.

అయితే అరెస్ట్‌కి భ‌య‌ప‌డి లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నాడు. ఒక‌వేళ నిజంగా ఢిల్లీలో లాయ‌ర్ల‌తో మాట్లాడే ప‌ని వుంటే ప్రైవేట్ విమానంలో వెళ్లి రావ‌డం ఎంత సేపు? డ‌బ్బుల‌కి కొదువ‌లేదు క‌దా! మ‌రి లోకేశ్‌కి ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో తెలీదు కానీ, ఢిల్లీ వ‌దిలి రావ‌డం లేదు. 

ఒక‌వేళ లోకేశ్‌ని కూడా అరెస్ట్ చేసి వుంటే, జ‌గ‌న్‌కి డ్యామేజీ అయ్యేది. తండ్రీకొడుకుల్ని అరెస్ట్ చేసి, ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌నే ఆలోచ‌న‌తో జ‌గ‌న్ త‌న గొయ్యి తానే త‌వ్వుకునే వాడు. జ‌నం అన్నీ చూస్తూ వుంటారు. వెనుక‌టికి ఇందిరాగాంధీ అంద‌ర్నీ జైల్లో పెట్టి చివ‌రికి ఓడిపోయారు. జ‌య‌ల‌లితని అసెంబ్లీ నుంచి త‌రిమేసిన క‌రుణానిధి త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఏమ‌య్యాడో తెలిసిందే.

జ‌నం అభిమానం సంపాదించాలంటే సానుభూతి మాత్ర‌మే చాల‌దు. పోరాడే గుణాన్ని జ‌నం ప్రేమిస్తారు. పిరికిత‌నాన్ని చూసి న‌వ్వుకుంటారు. యుద్ధంలో పారిపోయే వాన్ని ఉత్త‌ర కుమారుడు అంటారు. ఆధునిక రాజ‌కీయాల్లో లోకేశ్ “ఉత్త‌”కుమారుడిగా మారిపోయాడు.